<b>భారతదేశ చట్టాలు సవరణలు</b>


<b>భారతదేశ చట్టాలు సవరణలు</b>

భారతదేశ చట్టాలు సవరణలు

రెగ్యులేటింగ్ చట్టం 1773

. ఈ చట్టం ద్వారా భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ వ్యవహారాల మీద పార్లమెంటరీ నియంత్రణ కోసం మొదటిసారిగా కచ్చితమైన చర్య చేపట్టడం జరిగింది.

. ఈ చట్టం ద్వారా మద్రాస్, బొంబాయి గవర్నర్లను బెంగాల్‌గవర్నరు ఆధీనంలోకి తెచ్చి, బెంగాల్ గవర్నర్‌ను గవర్నర్ జనరల్‌గా నియమించారు.

.బెంగాల్ గవర్నర్ జనరల్‌కు, మద్రాస్ - బొంబాయి గవర్నర్లకు నలుగురు సభ్యులతో కూడిన సలహా సంఘాలను ఈ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. ఈ చట్టం సుప్రీంకోర్టు ఏర్పాటుకు వీలు కల్పించింది. ఈ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్‌గా నియమితుడైన మొదటి వ్యక్తి వారన్ హేస్టింగ్స్.

పిట్స్ ఇండియా చట్టం 1784

.రెగ్యులేటింగ్ చట్టం 1773 లోని లోపాలను తొలగించడానికి బ్రిటిష్ పార్లమెంట్ పిట్స్ ఇండియా చట్టాన్ని 1784లో రూపొందించింది.

.ఈస్టిండియా కంపెనీ వ్యవహారాలను పరిశీలించడానికి ఇంగ్లండ్‌లో ఆరుగురు సభ్యులతో కూడిన బోర్డ్ ఆఫ్ కంట్రోల్ (నియంత్రణ మండలి) ని ఏర్పాటు చేసింది. ఈ ఆరుగురిలో ఒకరు రాజ్య కార్యదర్శి, మరొకరు ప్రభుత్వ కోశాగార ఛాన్స్‌లర్ కాగా మిగిలిన నలుగురు ప్రివీ కౌన్సిలర్లు.

.పరిపాలనలో కంపెనీ ద్వంద్వ విధానాన్ని ప్రవేశపెట్టింది.

. గవర్నర్ జనరల్, గవర్నర్ల సలహా సంఘంలో సభ్యులను నాలుగు నుంచి మూడుకు తగ్గించి, గవర్నరు జనరల్, గవర్నర్ల అధికారాన్ని పెంచింది.

.బెంగాల్ గవర్నర్ జనరల్‌కు బొంబాయి - మద్రాస్ గవర్నర్ల మీద స్పష్టమైన అధికారాన్ని నెలకొల్పింది.

1793 చార్టర్ చట్టం

. ఈ చట్టం ద్వారా గవర్నర్, గవర్నర్ జనరల్‌లకు సలహా సంఘాల నిర్ణయాలను తోసిపుచ్చే అధికారం ఇచ్చారు.

1813 చార్టర్ చట్టం

. బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి మొదటి రాణి ఇచ్చిన వాణిజ్య గుత్తాధికారాన్ని రద్దుచేసి, భారతదేశ వాణిజ్యంలో ఆంగ్లేయులందరికీ సమాన అవకాశాలు ఈ చట్టం ద్వారా కల్పించారు.

.ఈ చట్టం ద్వారా భారతదేశంలో క్రైస్తవ మత ప్రచారానికి ఒక బిషప్, ముగ్గురు ప్రీస్టులను నియమించారు.

. ఈ చట్టం ద్వారా బ్రిటిష్ ఇండియాలో విద్యాభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం లక్షరూపాయలు కేటాయించారు

1833 చార్టర్ చట్టం

.బ్రిటిష్‌వారు ఇండియాలో కేంద్రీకృత పాలనావ్యవస్థను ప్రవేశపెట్టారు.

.బెంగాల్ గవర్నర్ జనరల్‌ను ఇండియా గవర్నర్ జనరల్‌గా నియమించి పౌర, సైనిక అధికారాలన్నింటినీ అప్పగించింది. ఈ విధంగా భారత గవర్నర్ జనరల్ అయిన మొదటి వ్యక్తి విలియం బెంటింక్.

.రాష్ట్ర ప్రభుత్వాల శాసన నిర్మాణాధికారాన్ని రద్దుచేసి, బ్రిటిష్ ఇండియా శాసన నిర్మాణాధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి అంటే గవర్నర్ జనరల్‌కు, అతడి సలహా సంఘానికి ఇచ్చారు.

.గవర్నర్ జనరల్ సలహాసంఘంలో ఒక న్యాయ సభ్యుడిని నియమించారు. ఆ విధంగా నియామకమైన మొదటి న్యాయ సభ్యుడు లార్డ్ మెకాలే.

.ప్రభుత్వంలో కార్యనిర్వాహక శాఖ, శాసన నిర్మాణ శాఖ వేర్వేరు అని సూచించిన మొదటి చట్టం ఇది.

.భారత సివిల్ సర్వీసులను ఏర్పాటు చేశారు.

1853 చార్టర్ చట్టం

.మొదటిసారిగా బెంగాల్ రాష్ట్ర పాలనను కేంద్రపాలన నుంచి వేరుచేసి, బెంగాల్ రాష్ట్రపాలనకు ఒక అసిస్టెంట్ గవర్నర్‌ను నియమించింది.

.పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థకు పునాది వేసింది. కార్యనిర్వాహక వర్గాన్ని శాసన వ్యవస్థగా వేరుచేసింది. పాలకమండలి సభ్యుల సంఖ్యను 24 నుంచి 18కి తగ్గించింది.

1858 భారత ప్రభుత్వ చట్టం

.ఇండియాను ఈస్టిండియా పాలన నుంచి తొలగించి బ్రిటిష్ పాలన కిందకు తెచ్చింది.

.బ్రిటిష్ గవర్నరు జనరల్‌ను రాజప్రతినిధి (వైస్రాయ్)గా చేసింది. (అంటే ఒకే వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వాలపై అజమాయిషీ చేసేటప్పుడు గవర్నర్ జనరల్‌గానూ, స్వదేశీ సంస్థానాలపై అధికారం చెలాయించేటప్పుడు రాజప్రతినిధిగా వ్యవహరిస్తాడు).

.ఈస్టిండియా కంపెనీని రద్దుచేసింది. భారత ప్రభుత్వం రాజ్య కార్యదర్శి ద్వారా నేరుగా బ్రిటిష్ ప్రభుత్వ పరిధిలోకి వెళ్లింది.

1861 భారత శాసన సభల (కౌన్సిళ్ల) చట్టం

.భారతీయులకు మొదటిసారిగా కేంద్ర-రాష్ట్ర శాసనసభల్లో సభ్యత్వం కల్పించింది.

.గవర్నర్ జనరల్ కౌన్సిల్ పోర్ట్‌ఫోలియో పద్ధతి ప్రవేశపెట్టి నేటి మన రాజ్యాంగంలోని మంత్రి మండలికి నాంది పలికింది.

.1833 చార్టర్ చట్టం వల్ల రాష్ట్రాలు కోల్పోయిన శాసన నిర్మాణాధికారాన్ని తిరిగి కల్పించి అధికార వికేంద్రీకరణకు నాంది పలికింది.

1892 భారత కౌన్సిళ్ల చట్టం

.మొదటిసారిగా శాసనసభ సభ్యులను, పరోక్ష ఎన్నిక విధానాన్ని ప్రవేశపెట్టింది.

.కేంద్ర, రాష్ట్ర శాసనసభల్లో అదనపు సభ్యులను పెంచారు. కార్యనిర్వాహక వర్గాన్ని ప్రశ్నించడానికి శాసనమండలి సభ్యులను అనుమతించారు.

1909 భారత కౌన్సిళ్ల చట్టం

.కేంద్ర - రాష్ట్ర కార్యనిర్వాహక మండలిలో ఇండియా కౌన్సిల్ భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించింది.

.ఈ చట్టాన్నే మింటో-మార్లే సంస్కరణలు అని కూడా అంటారు.

.కేంద్ర కార్యనిర్వాహక మండలిలో నియామకమైన మొదటి భారతీయుడు ఎస్.పి. సిన్హా.

.కుల, మత ప్రాతిపదికపై ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చేసిన మొదటి చట్టం ఇది.

.శాసనసభలో భారతీయులకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించి, ప్రత్యక్ష ఎన్నిక విధానం ప్రవేశపెట్టిన మొదటి చట్టం ఇది.

.కేంద్రంలోని శాసనసభ సభ్యుల సంఖ్యను 16 నుంచి 60కి పెంచారు.

.ప్రత్యేక ఎలక్టోరేట్‌ను ఏర్పాటుచేయడం ద్వారా ముస్లింలకు కమ్యూనల్ ప్రాతినిధ్య వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ వ్యవస్థను గురించి ముస్లిం సభ్యులను ముస్లిం ఓటర్లు మాత్రమే ఎన్నుకుంటారు.

1919 భారత ప్రభుత్వ చట్టం

. కేంద్ర శాసన వ్యవస్థలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టింది.

. రాష్ట్ర ప్రభుత్వంలో ద్వంద్వ ప్రభుత్వ విధానం ప్రవేశపెట్టింది.

.ఈ చట్టాన్నే మాంటెంగ్ - చెమ్స్‌ఫోర్డ్ సంస్కరణలు అని కూడా అంటారు.

.మనదేశంలో పార్లమెంటరీ విధానానికి (బాధ్యతాయుత విధానానికి) పునాదులు వేసింది.

. భారతీయులను పరిపాలనా వ్యవస్థలో భాగస్వాములుగా చేసి, పరిపాలనా శిక్షణ ఇచ్చిన చట్టం ఇది.

.రాష్ట్ర పరిధిలోని అంశాలను బదిలీ, రిజర్వ్ చేసినవి అనే రెండు వర్గాలుగా విభజించింది.

. దేశంలో ప్రథమంగా ప్రత్యక్ష ఎన్నికలను ప్రవేశపెట్టింది. కమ్యూనల్ ప్రాతినిధ్యాన్ని సిక్కులు, క్రైస్తవులు, ఆంగ్లో-ఇండియన్లకు కూడా విస్తరించింది.

. సివిల్ ఉద్యోగుల నియామకం కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుకు ఈ చట్టం వీలు కల్పించింది. ఈ కమిషన్ 1926లో అమల్లోకి వచ్చింది.

1935 భారత ప్రభుత్వ చట్టం

.కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని, రాష్ట్రాల్లో సంపూర్ణ బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది.

.ఈ చట్టాన్ని జవహర్‌లాల్ నెహ్రూ చార్టర్ ఆఫ్ ప్లీనర్‌గా అభివర్ణించాడు.

.ఈ చట్టం రాష్ట్రాలు, సంస్థానాలతో కూడిన అఖిల భారత సమాఖ్య ఏర్పాటుకు వీలు కల్పించింది.

.ఈ చట్టం అధికారాన్ని సమాఖ్య, రాష్ట్ర, ఉమ్మడి జాబితాలుగా విభిజించింది.

.ఇది భారత రాజ్యాంగానికి అతిపెద్ద ఆధారంగా రూపొందింది.

.ఈ చట్టం ప్రకారం నేటి సుప్రీంకోర్టుకు మూలమైన ఫెడరల్ కోర్టును 1935 అక్టోబరు 1న నెలకొల్పారు.

ప్రస్తుతం రాజ్యాంగ సవరణ విధానం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. మన రాజ్యాంగ నిర్మాతలు మారుతూ ఉండే రాజకీయ, ఆర్థిక పరిస్థితుల వల్ల ఎదురయ్యే సమస్యలను పరిష్కరించే విధంగా రాజ్యాంగాన్ని రూపొందించారు.

రాజ్యాంగాన్ని సవరించే విధానాన్ని నిర్దేశించే రాజ్యాంగ నిబంధన 368, విభాగం 20లో ఉంది. రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది. 368వ నిబంధన రాజ్యాంగాన్ని సవరించడానికి పాటించాల్సిన నిబంధనల గురించి తెలుపుతుంది.

రాజ్యాంగం సవరించే ఏ బిల్లునైనా పార్లమెంటు ఉభయ సభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఉభయ సభల్లో ప్రత్యేక మెజారిటితో, అంటే సభకు హాజరైన సభ్యుల్లో 2/3వ వంతు సభ్యుల మెజారిటీతో సభ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి దాన్ని ఆమోదిస్తారు. అయితే కొన్ని అంశాలు అంటే 54, 55, 73, 162, 241 నిబంధనలకు మార్పులు; 5వ భాగంలోని 4వ చాప్టర్, 6వ చాప్టర్; 11వ భాగంలోని మొదటి చాప్టర్ రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్డ్‌కు చేసే సవరణలు.

పార్లమెంటుకు రాష్ట్రాల్లో కల్పించిన భాగస్వామ్యం వీటికి సంబంధించిన అంశాలపై రాజ్యాంగ సవరణ చేయాలంటే 2/3వ వంతు మెజారీటితో సగం కంటే ఎక్కువ రాష్ట్రాల ఆమోదం అవసరం.

1వ సవరణ

. మొదటి రాజ్యాంగ సవరణ 1951లో చేశారు.

. భూ సంస్కరణలకు సంబంధించిన నిబంధనలు 31ఎ, 31బి రూపంలో రెండు కొత్త అంశాల్ని 9వ షెడ్యూల్‌లో చేర్చారు. 9వ షెడ్యూల్‌లో చేర్చిన అంశాలు కోర్టుల న్యాయసమీక్ష పరిధిలోకి రావు.

. 15, 19, 85, 87, 174, 341, 342, 372, 376 నిబంధనలను సవరించారు.

. ఈ సవరణ వాక్ స్వాతంత్య్రం, వృత్తివ్యాపార నిర్వహణ హక్కు, సమానత్వపు హక్కు, ఆస్తి హక్కులపై (ప్రకరణ-19) కొన్ని నియంత్రణలను ప్రవేశపెట్టింది.

. ఈ సవరణ నిబంధన 19(6) కు వివరణ ఇస్తూ, రాజ్యపర వాణిజ్యం, జాతీయీకరణపై ప్రభుత్వ హక్కును ధృవీకరించింది.

2వ సవరణ

. 1952లో చట్టం చేశారు. (1953 నుంచి అమల్లోకి వచ్చింది).

. పార్లమెంటులో రాష్ట్రాలకు కేటాయించిన స్థానాలపై మార్పులకు సంబంధించిన సవరణ ఇది.

. 81వ నిబంధనను సవరించారు.

. 1951 జనాభా లెక్కలకు అనుగుణంగా లోక్‌సభలో ప్రతి 7,50,000 కనీస జనాభాకు ఒక లోక్‌సభ నియోజక వర్గాన్ని కేటాయించారు.

3వ సవరణ

. ఈ సవరణ 1954లో చట్టంగా మారింది. 1955 నుంచి అమల్లోకి వచ్చింది.

. ఈ సవరణ ద్వారా ముడిపత్తిని, ఆహార ధాన్యాల ఉత్పత్తి, పశువులకు సంబంధించిన అంశాలను ఉమ్మడి జాబితాలోకి మార్చారు.

. 7వ షెడ్యూల్డ్‌ను సవరించారు.

4వ సవరణ

. ఈ సవరణను 1955లో చేశారు.

. దీని ద్వారా 31, 31ఎ, 305 నిబంధనలకు సవరణలు చేశారు. 9వ షెడ్యూల్డ్‌లో కూడా సవరణలు జరిగాయి.

. భారత ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు స్వాధీనం చేసుకున్న ఆస్తులపై ఇచ్చే నష్టపరిహారంపై కోర్టుల ప్రమేయం లేకుండా చేశారు.

5వ సవరణ

. 1955లో ఈ సవరణ చేశారు.

. 3వ నిబంధనకు మార్పులు చేశారు.

. ఒక రాష్ట్ర విస్తీర్ణం, సరిహద్దులపై కేంద్రం చేసే చట్టాలకు, నిర్ణీత కాలపరిమితిని నిర్ణయించే అధికారం రాష్ట్రపతికి ఇచ్చి, గడువులోగా ఆ రాష్ట్రం స్పందించకపోతే కేంద్రం ఆ చట్టాన్ని పార్లమెంటులో ప్రకటించే అధికారాన్ని పొందింది.

6వ సవరణ

. 1956లో ఈ సవరణ చేశారు.

. 269, 286 నిబంధనలను; 7వ షెడ్యూల్‌లోని 1, 2వ జాబితాలను సవరించారు.

. అంతర్ రాష్ట్రాల మధ్య జరిగే వాణిజ్యాలపై పన్నులను విధించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది.

7వ సవరణ

. 1956లో 7వ సవరణ చేశారు.

. ఈ సవరణలో 290ఎ, 350ఎ, 350బి, 372ఎ, 378ఎ నిబంధనలను కొత్తగా చేర్చారు.

. రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ కమిషన్ సిఫారసులకు అనుగుణంగా ఎ, బి, సి రకం రాష్ట్రాలను తొలగించి, ఎ, బి రకాల రాష్ట్రాలను ఒకే రకంగా పరిగణిస్తూ సి రకం రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా పరిగణించారు.

. రాష్ట్రాల పునర్విభజన ద్వారా 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు.

. లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్ర శాసనసభ స్థానాల్లోనూ మార్పులు చేశారు.

. హైకోర్టులో తాత్కాలిక, అదనపు న్యాయమూర్తుల నియామకానికి అవకాశం కల్పించారు.

. ఆంధ్రప్రదేశ్, పంజాబ్, బొంబాయి రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని ప్రత్యేక అంశాలను చేర్చారు.

8వ సవరణ

. ఈ సవరణ 1959లో చట్టంగా మారింది. 1960 నుంచి అమల్లోకి వచ్చింది.

. 330, 332, 334 నిబంధనలకు సవరణలు జరిగాయి.

. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు, ఆంగ్లో ఇండియన్లకు సంబంధించిన రిజర్వేషన్ సీట్ల పరిధిని 1970 వరకు పొడిగించారు

9వ సవరణ

. ఈ సవరణ 1960లో చట్టంగా మారింది. 1961లో అమల్లోకి వచ్చింది.

. మొదటి షెడ్యూల్డ్‌కు సవరణ జరిగింది.

. ఈ సవరణ ద్వారా బెరూబెరీ ప్రాంతాన్ని పాకిస్థాన్‌కు బదిలీ చేశారు. .

10వ సవరణ

. 1961లో ఈ సవరణ చేశారు.

. 240 నిబంధన, మొదటి షెడ్యూల్డ్‌ను సవరించారు.

. దాద్రానగర్ హవేలీని కేంద్రపాలిత ప్రాంతంగా భారతదేశంలో విలీనం చేశారు.

11వ సవరణ

. ఈ సవరణ 1961లో జరిగింది.

. 66 (1), 71 (4) నిబంధనలకు సవరణలు జరిగాయి.

. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఉభయ సభలు సంయుక్తంగా కాకుండా, విడివిడిగా ఎన్నికల్లో పాల్గొనడానికి అవకాశం కల్పించారు.

. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో లోక్‌సభ, రాజ్యసభల్లో ఖాళీలు ఏర్పడినప్పుడు న్యాయస్థానాలకు వెళ్లడం నిరోధించారు.

12వ సవరణ

. ఈ సవరణను 1962లో చేశారు.

. 240వ నిబంధనకు, మొదటి షెడ్యూల్డ్‌కు సవరణ జరిగింది.

. గోవా, డామన్-డయ్యూలను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించి, మొదటి షెడ్యూల్డ్‌లో మార్పులు చేసి భారతదేశంలో విలీనం చేశారు.

13వ సవరణ

. ఈ సవరణ 1962లో చట్టంగా మారి, 1963 నుంచి అమల్లోకి వచ్చింది.

. 371 (ఎ) నిబంధనను రాజ్యాంగంలో చేర్చారు.

. నాగాలాండ్‌కు రాష్ట్ర హోదా కల్పించి, కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించారు.

14వ సవరణ

. ఈ సవరణ 1962లో జరిగింది.

. నిబంధన 81ని సవరించి, కేంద్రపాలిత ప్రాంతాలకు లోక్‌సభలో ప్రాతినిధ్యాన్ని 20 నుంచి 25కు పెంచారు.

. 239 (ఎ), 241 నిబంధనలకు; మొదటి, 4వ షెడ్యూల్డ్‌కు సవరణలు చేశారు.

. పాండిచ్చేరి ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా భారతదేశంలో చేర్చారు.

15వ సవరణ

. 1963లో సవరింరించారు.

. 124, 128, 217, 224, 224(ఎ), 226, 297, 311 నిబంధనలు, 7వ షెడ్యూల్డ్‌లో సవరణలు చేశారు.

. హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసును 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచారు.

. నిబంధన 297కు కాంటినెంటల్ షెల్ఫ్ అనే పదాన్ని చేర్చారు.

. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలను కుదించారు.

16వ సవరణ

. 1963లో ఈ సవరణ జరిగింది.

. 19, 84, 174 నిబంధనలు, 2వ షెడ్యూల్డ్‌కు సవరణలు జరిగాయి.

. రాష్ట్రాలకు స్వేచ్ఛాహక్కుపై నియంత్రణలు, నిర్బంధాలు విధించడానికి అధికారం కల్పించారు.

. నిబంధన 84, 173 లకు సవరణ, 3వ షెడ్యూల్డ్‌లో ఉన్న ప్రతిజ్ఞను మార్చారు.

17వ సవరణ

. ఈ సవరణను 1964లో చేశారు.

. 31(ఎ) నిబంధనలు, 9వ షెడ్యూల్‌కు సవరణలు జరిగాయి.

. రాష్ట్రాల న్యాయసమీక్ష, అధికారాన్ని పునర్ నిర్వచించడం జరిగింది.

. మార్కెట్ విలువ చెల్లించకపోతే సొంత వ్యవసాయంలో ఉన్న భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని నిరోధించారు.

18వ సవరణ

. 1966లో ఈ సవరణ చేశారు.

. 3వ నిబంధనకు సవరణలు జరిగాయి.

. 3వ నిబంధనలో రాష్ట్రం అనే మాటను పునర్ నిర్వచించారు.

. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ కేంద్రపాలిత ప్రాంతాల పునర్నిర్మాణం కోసం ఈ సవరణ చేశారు.

19వ సవరణ

. ఈ సవరణ 1966లో జరిగింది.

. 324వ నిబంధనకు సవరణలు జరిగాయి.

. ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసే ఎన్నికల ట్రిబ్యునల్‌లను రద్దుచేసి, ఎన్నికల ఫిర్యాదులను హైకోర్టులకి అప్పగించడం ఈ సవరణ ముఖ్య ఉద్దేశం.

20వ సవరణ

. 1966లో ఈ సవరణ జరిగింది.

. 233(ఎ) నిబంధనను చేర్చారు.

. ఈ సవరణ ద్వారా జిల్లా జడ్జీలను నియమించే ప్రాతిపదికను రాజ్యాంగంలో చేర్చారు.

. చంద్రమోహన్ - ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కేసులో జిల్లా జడ్జీల నియామకంపై సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా 233(ఎ) ను రూపొందించి, గవర్నర్ల ద్వారా నియామకానికి ఏర్పాటు చేశారు.

21వ సవరణ

. 1967లో ఈ సవరణ జరిగింది.

. 8వ షెడ్యూల్డ్‌ను సవరించి సింథి భాషకు రాజ్యాంగపరమైన గుర్తింపు ఇచ్చారు.

. దీంతో అధికార భాషల సంఖ్య 15కి పెరిగింది.

22వ సవరణ

. ఈ సవరణ 1969లో జరిగింది.

. 244ఎ నిబంధనను, 371బి నిబంధనను రాజ్యాంగంలో చేర్చారు.

. అస్సాంలో అంతర్భాగంగా ఉన్న మేఘాలయాను స్వయంపాలిత రాష్ట్రంగా ప్రకటించి.. దానికి శాసనసభ, మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేశారు.

23వ సవరణ

. 1970లో ఈ సవరణ జరిగింది.

. 331, 332, 333, 334 నిబంధనలకు సవరణలు చేశారు.

. పార్లమెంటు, రాష్ట్ర శాసన సభల్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్లను 1980 వరకు పెంచారు.

24వ సవరణ

. 1971లో ఈ సవరణ చేశారు.

. 13వ నిబంధన, 368వ నిబంధనకు సవరణలు జరిగాయి.

. పార్లమెంటుకు ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్నయినా సవరించే అధికారం కల్పించారు.

25వ సవరణ

. ఈ సవరణ 1971లో చట్టంగా మారి, 1972 నుంచి అమల్లోకి వచ్చింది.

. 31, 31సి నిబంధనలను రాజ్యాంగంలో చేర్చారు.

. ఇది బ్యాంకుల జాతీయీకరణ నేపథ్యంలో జరిగింది.

. మొత్తం అనే మాటను పరిహారం అనే మాటకు బదులుగా చేర్చారు.

. 39వ అధికరణ ప్రకారం ప్రాథమిక హక్కులకు ఆదేశిక సూత్రాల కంటే తక్కువ స్థానం కల్పించారు.

26వ సవరణ

. 1971లో ఈ సవరణ జరిగింది.

. నిబంధన 366ను సవరించి, నిబంధన 363ను చేర్చారు. 291, 362 నిబంధనలను తొలగించారు.

. రాజులకు ఉన్న ప్రత్యేక గుర్తింపును ఉపసంహరించడం, వారికి ఇచ్చే భరణాలను నిషేధించడం ఈ సవరణ ఉద్దేశం.

27వ సవరణ

. 1971లో ఈ సవరణ చేశారు.

. 293బి, 371సి నిబంధనలను రాజ్యాంగంలో చేర్చారు.

. దీని ద్వారా ఈశాన్య రాష్ట్రాలను పునర్ వ్యవస్థీకరించారు.

. నిబంధన 240ను సవరించి మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్‌కు కొన్ని ప్రత్యేక సదుపాయాలను కల్పించారు.

. 371సి నిబంధన మణిపూర్‌కు అసెంబ్లీ మంత్రివర్గాన్ని కల్పించింది.

28వ సవరణ

. ఈ సవరణ 1971లో జరిగింది.

. 312ఎ నిబంధనను రాజ్యాంగంలో చేర్చారు. 314ఎ నిబంధనను రాజ్యాంగం నుంచి తొలగించారు.

. సెలవు, పెన్షన్, క్రమశిక్షణా చర్యకు సంబంధించి భారత సివిల్ సర్వీసు అధికారులకు ఉన్న ప్రత్యేక హక్కులను తొలగించారు.

. సివిల్ సర్వీసు నియామకాలను మార్చే అధికారాలను పార్లమెంటుకు ఇచ్చారు.

29వ సవరణ

. 1972లో ఈ సవరణ జరిగింది.

. 9వ షెడ్యూల్డ్‌కు సవరణ చేశారు.

. కేరళలో చట్టంగా మారిన భూ సంస్కరణల చట్టాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చారు.

30వ సవరణ

. ఈ సవరణ 1972లో చట్టంగా మారి, 1973 నుంచి అమల్లోకి వచ్చింది.

. 133వ నిబంధనకు సవరణ జరిగింది.

. న్యాయసంబంధ సమస్యలు తలెత్తే సమయంలో సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవాల్సి ఉంటుంది.

. సుప్రీంకోర్టుకు అప్పీలు చేయడానికి అయ్యే 20 వేల రూపాయల వ్యయాన్ని తొలగించారు.