డాక్టర్ అందె శ్రీ
డాక్టర్ అందె శ్రీ
అందెశ్రీ (జ. జూలై 18, 1961) వరంగల్ జిల్లాకు చెందిన తెలుగు కవి, సినీ గేయ రచయిత.
పరిచయం
ప్రజాకవి, ప్రకృతి కవిగా సుప్రసిద్ధులైన డా. అందెశ్రీ వరంగల్ జిల్లా, జనగాం వద్ద గల రేబర్తి (మద్దూర్ మండలం) అనే గ్రామంలో జన్మించారు. ఈయన అసలు పేరు అందె ఎల్లయ్య. ఈయన ఒక అనాథగా పెరిగారు. ఏ చదువూ చదవలేదు. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు.
గేయ రచనలు
ఈయన గొడ్ల కాపరిగా పనిచేసారు. శృంగేరి మఠానికి సంబంధించిన స్వామీ శంకర్ మహారాజ్ ఇతను పాడుతుండగా విని ఇతడిని చేరదీసాడు. రాష్ట్రవ్యాప్తంగా ఈయన పాటలు ప్రసిద్ధం. నారాయణ మూర్తి ద్వారా వచ్చిన విప్లవాత్మక సినిమాల విజయం వెనుక ఈ పాటలున్నాయి. తెలంగాణ, ప్రకృతి లాంటి అంశాలపై ఈయన గేయరచన చేసారు. ఈయన అశువు కవిత్వం చెప్పటంలో దిట్ట. 2006లో గంగ సినిమాకు గానూ నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఈయన తెలంగాణ మాతృగీతం రచించారు.
అందెశ్రీ రాసిన కొన్ని గీతాలు
- జయజయహే తెలంగాణ జననీ జయకేతనం (తెలంగాణ మాతృగీతం)
- పల్లెనీకు వందనములమ్మో
- మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు
- గలగల గజ్జెలబండి
- కొమ్మ చెక్కితే బొమ్మరా...
- జన జాతరలో మన గీతం
- యెల్లిపోతున్నావా తల్లి
- చూడ చక్కని
అందుకున్న పురస్కారాలు
- తెలంగాణప్రభుత్వము ఈయనను భారత అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీ అందుకొనుటకు ప్రతిపాదించినది
- ఎర్ర సముద్రం సినిమా కోసం రచించిన మాయమైపోతుండమ్మా మనిషన్నవాడు ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల తెలుగు విషయం రెండో సంవత్సరం సిలబస్ లో చేర్చారు.
- కాకతీయ విశ్వవిద్యాలయం ఈయనకు గౌరవ డాక్టరేట్ అందించింది.
- అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్, వాషింగ్ టన్ డి.సి వారి గౌరవ డాక్టరేట్ తోపాటు లోకకవి అన్న బిరుదునిచ్చి 2014 ఫిబ్రవరి 1లో సన్మానించారు.
- వంశీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారిచే దాశరథి సాహితీ పురస్కారం (2015 ఆగస్టు 14)
- డాక్టర్ రావూరి భరద్వాజ, రావూరి కాంతమ్మ ట్రస్ట్ వారిచే జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం (2015 జూలై 5)
- నంది పురస్కారం కూడా అందుకున్నారు.
- మలిదశ తెలంగాణ ఉద్యమంలో కవిగా మహోన్నతమైన పాత్రను నిర్వర్తించాడు. అంతేకాకుండా తెలంగాణ ధూంధాం కార్యక్రమ రూపశిల్పిగా తెలంగాణ 10 జిల్లాల్లోని ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని కలిగించాడు.
- అందెశ్రీ రచించిన జయజయహే తెలంగాణ గీతాన్ని తెలంగాణ ప్రజలు ముక్కోటి గొంతుకలతో... ఇప్పటికి విద్యాసంస్థలలో, ఇతర ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర కార్యక్రమాలలో తెలంగాణ జాతి గీతంగా, ప్రార్థనాగీతంగా పాడుకోవడం విశేషం.