<b> విష్ణుకుండినులు </b>


<b> విష్ణుకుండినులు </b>

విష్ణుకుండినులు

 

పాలమూరు శాసనం విష్ణుకుండినుల వంశ వృక్షం, కాలాన్ని నిర్ణయించడానికి ప్రధాన ఆధారంగా ఉంది. దీన్ని మాధవ వర్మ వేయించారు. వీరి స్వస్థలం వినుకొండ అని కేల్ హారన్ అనే భాషా శాస్త్రవేత్త నిర్ణయించాడు. వీరి కులదైవం శ్రీపర్వత స్వామి (శ్రీశైల మల్లికార్జునుడు). విష్ణుకుండినుల్లో మొదటి పాలకుడు ఇంద్రవర్మ.

ఇంద్రవర్మఈయన ఇంద్రపాల నగరం నిర్మించారు. ఇదే నేటి నల్గొండ జిల్లాలోని తుమ్మల గూడెం అని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. ఈయన తర్వాత మొదటి గోవింద వర్మ అధికారంలోకి వచ్చారు.

మొదటి గోవింద వర్మఈయన విష్ణుకుండినుల తొలిరాజుల్లో ప్రసిద్ధి చెందినవారు. మంచి రాజనీతిజ్ఞుడు, పరాక్రమవంతుడు. కృష్ణా, గోదావరి మధ్య ప్రాంతాన్ని (తెలంగాణ) జయించి విశాల రాజ్యాన్ని నిర్మించారు. ఈయన బౌద్ధమతాభిమాని. తీరాంధ్రలోని గుణపాశపురంలో బలవంతుడైన మూలరాజు వంశస్థుడైన పృథ్వీమూలుని కుమార్తె మహాదేవిని వివాహం చేసుకున్నారు. వారి సహాయంతో శాలంకాయనులను ఓడించారు. ఈయన పట్టమహిషి మహాదేవి బౌద్ధమతాభిమాని. ఈమె తన పేరు మీద ఇంద్రపురిలో చాతుర్థదశార్య సంఘ భిక్షువులకు మహా విహారాన్ని నిర్మించారు. ఈ విహారానికి గోవిందవర్మ ఏనకబండ గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చారు. ఈ గ్రామం నల్గొండ జిల్లాలోని మోత్కూర్ తాలుకాలో ఉంది. దీని అసలుపేరు వెణ్కపణ.

రెండో మాధవ వర్మఈయనకు త్రికూట మలయాధిపతి అనే బిరుదు ఉంది. ఈ త్రికూట పర్వతమే నేటి కోటప్పకొండ. రెండో మాధవ వర్మ విష్ణుకుండినుల్లో గొప్ప పాలకుడు. రాజసూయ, అశ్వమేథ యాగాలను నిర్వహించారు. ఈయన నరమేథ యాగాలు కూడా చేశారు. దక్షిణ దేశ రాజ్యాలను జయించారు. వాకాటక చక్రవర్తి రెండో పృథ్వీసేనుని జయించి ఆయన కుమార్తె మహాదేవిని వివాహం చేసుకున్నారు. ఈ విజయాలను పురస్కరించుకొని పదకొండు అశ్వమేథ యాగాలు, వేయి క్రతువులు నిర్వహించారు. రాజధానిని ఇంద్రపాల నగరం నుంచి అమరావతికి మార్చారు. వేంగి సమీపంలోని దెందులూర్ పురానికి మార్చారని కొందరు చరిత్రకారుల అభిప్రాయం.

దక్షిణాపథంలోని పడమటి సగభాగంలో ఉన్న కుంతల దేశం నుంచి ఉత్తరాన రేవానది వరకు, అజంతా-ఎల్లోరా నుంచి పశ్చిమ సముద్రం వరకు వాకాటక సామ్రాజ్యం విస్తరించి ఉండేది. తర్వాత ఈ రాజ్యం విష్ణుకుండినుల రాజ్యంలో అంతర్భాగమైంది.
రెండో మాధవ వర్మ భైరవకొండ, ఇంద్రకీలాద్రి, మొగల్రాజపురం, ఉండవల్లి బౌద్ధక్షేత్రాలను ధ్వంసం చేసి హైందవమతాన్ని పునరుద్ధరించారు. ఉండవల్లిలో బుద్ధుడి శిల్పాన్ని పగులగొట్టించి శయనిస్తున్న విష్ణుమూర్తి విగ్రహాన్ని చెక్కించారు. ఈయన కాలంలో అమరావతి కోసం బౌద్ధులు, శైవులు ఘర్షణపడ్డారు. బౌద్ధారామాన్ని పగులగొట్టి శివలింగాన్ని ప్రతిష్టించారు. కీసర(రంగారెడ్డి జిల్లా)లోని రామలింగేశ్వరాలయం, ఇంద్రపాల నగరంలోని అమరేశ్వర, మల్లికార్జున ఆలయాలు, చెరువు గట్టులోని జడల రామలింగేశ్వర ఆలయం మొదలైనవాటిని ఈయన నిర్మించారు.

మూడో మాధవ వర్మరెండో మాధవ వర్మ కుమారుడు దేవవర్మ. ఈయన కుమారుడు మూడో మాధవ వర్మ. ఈయనకు జనాశ్రయ, అవిసిత వివిధ దివ్య అనే బిరుదులున్నాయి. ఉత్తర భారతదేశాన్ని పాలించిన హర్షుడు ఈయన సమకాలీకుడు.

ఇంద్రభట్టారక వర్మఈయన ఈశాన వర్మ చేతిలో ఓడిపోయి తన కుమార్తె ఇంద్రభట్టారికను ఈశాన వర్మ కుమారుడు శర్వవర్మకిచ్చి వివాహం చేశారు. ఈయన కీసర సమీపంలో ఘటకేశ్వరం (నేటి ఘట్‌కేసర్) అనే ఘటిక స్థానాలు నెలకొల్పారు. ఘటికలు అంటే బ్రాహ్మణ విద్యా సంస్థలు.

మంచన భట్టారకుడుమూడో మాధవ వర్మ కుమారుడు మంచన భట్టారకుడు. ఈయన విష్ణుకుండినుల వంశంలో చివరి రాజు. ఈయన సమర్థుడు కాకపోవడం వల్ల కొద్ది కాలానికే చాళుక్యులు తీరాంధ్రను జయించి వేంగి చాళుక్య రాజ్యాన్ని స్థాపించారు. వేంగి చాళుక్య రాజ్య స్థాపకుడు కుబ్జ విష్ణువర్ధనుడు.
విష్ణుకుండినులకు వాకాటక కుటుంబాలతో వైవాహిక సంబంధాలు ఉండేవి. శ్రీపర్వతం అంటే నాగార్జునకొండ అని, విష్ణుకుండినుల కులదైవం బుద్ధుడు లేదా కార్తికేయుడు కావొచ్చునని కొంతమంది చరిత్రకారులు భావిస్తున్నారు. విష్ణుకుండినుల పాలకులు వైదిక మత నిరతులు. వీరి శాసనాల్లో మాత్రమే శ్రీపర్వత స్వామి ప్రస్తావన ఉంది.

విష్ణుకుండినుల రాజ లాంఛనం (రాజముద్ర) సింహం. వీరు వేయించిన శాసనాల్లోని రాజముద్రికల్లో లంఘించే (దూకే) సింహాన్ని ముద్రించారు. వీరి నాణేల్లోనూ ఈ చిహ్నం కనిపిస్తుంది. కీసర రామలింగేశ్వరాలయాన్ని వీరి రాజచిహ్నం పేరుపైనే నిర్మించారు.
నల్గొండ మండలంలోని దొండపాడు గ్రామంలో నాణేల బిందె లభించింది. ఈ నాణేలపై నోరు తెరచుకొని లంఘించడానికి సిద్ధంగా ఉన్న సింహం రూపం, దానికి ముందు అడ్డంగా విచ్చుకత్తి; సత్యాశ్రయ, విషమసిద్ధిఅనే అక్షరాలను చెక్కారు.

విష్ణుకుండినుల కాలం నాటిముఖ్యమైన శాసనాలు

1) చిక్కుళ్ల శాసనం - విక్రమేంద్రవర్మ
2) రామతీర్థం - ఇంద్రవర్మ
3) పాలమూరు - మాధవవర్మ
4) వేల్పూరు - రెండో మాధవవర్మ
విష్ణుకుండినులు శ్రీశైల మల్లికార్జున స్వామి భక్తులు. శ్రీపర్వత పాదాక్రాంతులు. కీసరగుట్టలోని రామలింగేశ్వర దేవాలయాన్ని వీరే నిర్మించారు. వీరు నరబలిని ప్రోత్సహించారు. విష్ణుకుండినుల రాజ చిహ్నం సింహం. ఘటికలు పేరుతో బ్రాహ్మణ విద్యా సంస్థలను ప్రారంభించిన తొలి రాజవంశం ఇదే.

 

పరిపాలనా విధానం

విష్ణుకుండినుల కాలంలో పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని రాష్ట్రాలు, విషయాలుగా విభజించారు. రాష్ట్రానికి అధిపతి రాష్ట్రికుడు, విషయానికి అధిపతి విషయాధిపతి. రాజాజ్ఞలకు లోబడి వీరు పాలన సాగించేవారు. వీరి కాలంలో భూమిని వివర్తనంలో కొలిచేవారు. విష్ణుకుండిన ప్రభువులు వారి వంశాభివృద్ధి కోసం దేవాలయాలు, వేద పండితులకు భూములు, అగ్రహారాలను దానం ఇచ్చేవారు. ముఖ్యంగా విజయయాత్రలకు బయలుదేరేటప్పుడు, యుద్ధ విజయానంతరం, సూర్య, చంద్ర, గ్రహణ సమయాల్లో బ్రాహ్మణులకు భూమి, సువర్ణం, అగ్రహారాలను దానం చేసేవారు. మాధవవర్మ గోదావరి నదిని దాటి తూర్పు తీర ప్రాంతాన్ని జయించే సందర్భంలో చంద్రగ్రహణ నిమిత్తం కున్రూరు గ్రామానికి చెందిన శివవర్మకు భూమిని దానం చేశాడు.

మత విధానం

విష్ణుకుండినుల కాలంలో బౌద్ధమతంలో వజ్రయాన శాఖ కృష్ణానదికి దక్షిణాన ఏర్పడింది. ఈ శాఖ ప్రచారం వల్ల బౌద్ధమతానికి ఉన్న కీర్తి, ప్రతిష్టలు, ప్రజాభిమానం నశించాయి. బౌద్ధులు అహింస పరమధర్మంగా భావించేవారు. కానీ ఈ వజ్రయాన శాఖకు చెందిన కొంత మంది వ్యక్తులు శక్తి పూజలు, తాంత్రిక పూజలు, రహస్య కలసాలు, మధుమాంస వినియోగం లాంటివాటిని ఆచరించారు. బౌద్ధ సంఘారామ విహారాలు (విశ్రాంతి మందిరాలు) నీతి బాహ్యమైన చర్యలకు నిలయం అయ్యాయి. దీంతో బౌద్ధమతం క్రమంగా ఆదరణ కోల్పోయింది. ఈ సమయంలో విష్ణుకుండిన పాలకులు బౌద్ధాన్ని ఆదరించి పోషించారు.
ఇక్ష్వాకు వంశం అంతరించిన తర్వాత పల్లవులు ఆంధ్రదేశాన్ని ఆక్రమించి వైదిక మత విస్తరణకు కారణమయ్యారు. బౌద్ధం రాజాదరణ కోల్పోయింది. బౌద్ధ సన్యాసులు ప్రజలను ఆకర్షించడానికి ఊరేగింపులు, సేవలు, పూజలు, ఆరాధనలు ప్రవేశపెట్టినా అంతగా ప్రభావం చూపలేదు. బౌద్ధారామ విహారాలు విలాస గృహాలుగా మారాయి. స్వదేశంలో ఆదరణలేకపోయినా బౌద్ధమతం ఖండాంతరాల్లో వ్యాపించింది.

విష్ణుకుండినుల్లో మొదటి మాధవవర్మ, మొదటి గోవిందుడు బౌద్ధమతాన్ని ఆదరించారు. ఇంద్రపాలనగర తామ్ర శాసనాల ద్వారా విష్ణుకుండినులు బౌద్ధమతం అనుసరించారని తెలుస్తోంది. గోవిందవర్మ బౌద్ధాన్ని ఆదరించాడని, బౌద్ధ సంఘాలకు అగ్రహారాలు ఇచ్చాడని, తన పట్టమహిషి మహాదేవి పేరుతో విహారం నిర్మించాడని ఈ శాసనాల్లో పేర్కొన్నారు.

శైవం: రెండో మాధవ వర్మ బలపరాక్రమ సంపన్నుడు. ఇతడు మొదట బౌద్ధ మతాన్ని అనుసరించాడు. వాకాటక మహాదేవిని వివాహం చేసుకున్న తర్వాత వైదిక మతాన్ని స్వీకరించాడు. కీసరలో రామలింగేశ్వరాలయం నిర్మించాడు. యజ్ఞ యాగాదులు నిర్వహించాడు. విష్ణుకుండినుల కాలంలో శైవమతానికి   మంచి ఆదరణ లభించింది. వీరి కాలంలో  కీసర, కోటప్పకొండ, ఇంద్రపాలనగరం తదితర ప్రాంతాల్లో శైవ దేవాలయాలు నిర్మించారు. ముఖ్యంగా శ్రీశైల మల్లికార్జునుడిని ఎక్కువగా ఆరాధించారు.

జైనం: విష్ణుకుండినుల కాలంలో జైనమతం క్షీణ దశలో ఉంది. జైనుల్లో దిగంబరులు, శ్వేతాంబరులు అని రెండు వర్గాలు ఉండేవి. తెలంగాణలో జైనమతం  క్షీణించడానికి కాపాలిక జైనులు కారకులు. పల్లవులు వైదిక మతాన్ని ఉద్ధరించి జైన మతానికి నీడ లేకుండా చేశారు. జైనాలయాలు, బౌద్ధరామ విహారాలు రాజుల ప్రోత్సాహంతో శైవక్షేత్రాలుగా రూపుదిద్దుకున్నాయి.

విద్య, సాహిత్యం

విష్ణుకుండినులు మొదట ప్రాకృత భాషను ఆదరించారు. గోవిందుడు తన పాలనా కాలంలో సంస్కృతాన్ని రాజభాషగా ప్రవేశపెట్టాడు. విక్రమేంద్ర భట్టారక వర్మ మహాకవి, పండిత పోషకుడు. విష్ణుకుండినులు సంస్కృతాంధ్ర భాషలను ప్రోత్సహించారు. తెలుగులో చంధోగ్రంథం జనాశ్రయచ్చంధో విచ్ఛిత్తి వీరి కాలంలోనే వెలువడింది.

ఘటికలు పేరుతో బ్రాహ్మణ విద్యాసంస్థలను ప్రారంభించారు. ఈ కాలం నాటి ప్రసిద్ధ విద్యాకేంద్రం ఘటికేశ్వర్. ఈ విద్యాకేంద్రాన్ని ఇంద్రభట్టారక వర్మ  స్థాపించాడు. గోవిందరాజు విహార (చైతన్యపురి) శాసనంలో ప్రాకృత భాషను ఉపయోగించారు. వీరి శాసనాల్లో తెలంగాణా పదాలు కనిపిస్తాయి.

బౌద్ధ పండితుల్లో దశబలబలి సర్వశాస్త్ర పారంగతుడని గోవింద వర్మ వేయించిన ఇంద్రపాలనగర తామ్రశాసనంలో పేర్కొన్నారు.

జనాశ్రయచ్చంధో విచ్ఛిత్తి: ఇది శాస్త్ర గ్రంథం. తెలంగాణ తొలి లక్షణ గ్రంథం ఇదే. కానీ ఇది అసంపూర్ణంగా ఉంది. అవతారిక పద్యాలు లేవు. దీన్ని గుణస్వామి రచించి మాధవవర్మ పేరుతో ప్రకటించినట్లుగా చరిత్రకారులు భావిస్తున్నారు. జనాశ్రయుని కాలంలో వ్యాప్తిలో ఉన్న కవితలకు, పద్యాలకు వివరణ గ్రంథం ఇది. మాధవవర్మకు తప్ప ఆ కాలంలో ఏ రాజుకు జనాశ్రయ అనే బిరుదు లేదు. ఈ గ్రంథంలోని ముఖ్యాంశాలు.
 1) వివిధ జాతుల పద్యాలున్నాయి.
 2) శీర్షికను ఏడు విధాలుగా పేర్కొన్నారు.
 3) శీర్షిక అంటే సీసం. పద్యాంతంలో గీత పద్యం ఉంది.
 4) ద్విపద, త్రిపదలు కూడా ఉన్నాయి.

న్యాయపాలన

 మాధవవర్మ వేయించిన పాలమూరు శాసనంలో న్యాయపాలనకు సంబంధించిన ప్రస్తావన ఉంది. న్యాయ శాస్త్రాలను అధ్యయనం చేసి దివ్యమార్గాలను అనుసరించిన విష్ణుకుండిన రాజు మూడో మాధవవర్మ. రాజే న్యాయపాలనకు అత్యున్నత అధికారి.

శిల్పకళ

ఉండవల్లి గుహాలయాలు: ఇవి నాలుగు అంతస్తుల్లో ఉన్నాయి. వీటిని గోవిందవర్మ నిర్మించాడు. ఇందులో మొత్తం 64 గుహలు ఉన్నాయి. మొదటి అంతస్తులో త్రిమూర్తుల విగ్రహాలు ఉన్నాయి. రెండో అంతస్తులో అనంతశయన విష్ణువు దేవాలయం, మూడో అంతస్తులో త్రికూఠ ఆలయం ఉన్నాయి. నాలుగో అంతస్తులో సన్యాసుల విశ్రాంతి మందిరాలు ఉన్నాయి. ఈ గుహల్లో పూర్ణకుంభం ఉంది.

భైరవ కొండ: ఇది ఎనిమిది గుహలతో కూడిన సముదాయం. దీన్ని శివుడికి అంకితం చేశారు. ఇందులో కుంభ శీర్షం ఉన్న సింహపాద స్తంభాలు ఉన్నాయి.
విష్ణుకుండినుల కాలంలో నూతన వాస్తుశిల్ప రీతి వృద్ధి చెందింది. ఉండవల్లి, మొగల్రాజపురం, ఇంద్రకీలాద్రి (విజయవాడ), అక్కన్న, మాదన్న గుహలు, భైరవకొండ గుహల్లో వాస్తు, శిల్పకళకు సంబంధించిన ఆధారాలు లభించాయి. 2015 మే 6న నల్గొండ జిల్లాలోని ఇంద్రపాలనగరంలో ప్రాచీన కాలంనాటి బుద్ధుడి శిల్పకళకు చెందిన విగ్రహాలు బయటపడ్డాయి. ఇవి 2000 ఏళ్ల కిందటివిగా చరిత్రకారులు భావిస్తున్నారు.