<b> General Science (Telugu)</b>

General Science (Telugu)

కణం నిర్మాణం

కణం యొక్క నిర్మాణం

అన్ని కణాలు మూడు ప్రధాన క్రియాత్మకమైన విషయాలు కలిగి ఉంటాయి:

1. కణ త్వచం లేదా ప్లాస్మా పొర

2. న్యూక్లియస్

3. సైటోప్లాజం

కణం యొక్క బయటి త్వచం ప్లాస్మా పొర. ఇది లిపిడ్లు, ప్రోటీన్లతో నిర్మితమై ఉంటుంది. దాని లోపల సైటోప్లాజమ్ ఉంటుంది. సైటోప్లాజంలో వివిధ సెల్యులార్ లేదా సెల్ ఆర్గానిల్స్ మరియు మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్లు మొదలైనవి చేరి ఉంటాయి.

మైట్రోకాండ్రియా(Mitochondria) అంతర్జీవ ద్రవ్యజాలం. రైబో సోములు, లైసోసోములు, గాల్జీ సంక్లిష్టం, కేంద్రకం వంటివి వృక్ష, జంతుకణం రెండింటిలో కనబడతాయి. సెంట్రియోల్స్ అనే నిర్మాణాలు కేవలం జంతుకణాల్లో మాత్రమే కనిపిస్తాయి. వృక్షకణాల్లో ఉండవు. మైటోకాండ్రియాలు పోగుల్లో ఉంటాయి. వీటి చుట్టూ రెండు పొరలతో ఉండే త్వచం ఉంటుంది. దీని లోపలి భాగాన్ని మాత్రిక అంటారు. మాత్రికలో డి.ఎన్.ఎ., రైబోజోమ్లు ఉంటాయి.

కణంలో శక్తి A.T.P. (అడినోసైన్ ట్రైఫాస్పేట్) అనే రూపంలో తయారై ఉంటుంది. శక్తిని A.T.P. రూపంలోనే కణం వినియోగించుకొంటుంది. అంతర్జీవ ద్రవ్యజాలం కణంలో లిపిడ్, ప్రొటీన్ల తయారీకి, కణాన్ని విషపదార్థాల బారినుంచి రక్షించడానికి, యాంత్రిక ఆధారాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. గాల్జీ సంక్లిష్టం స్రావక క్రియకు, లైసోసోములను ఏర్పరచడానికి ఉపయోగపడుతుంది.

కేంద్రకంలో (Nuclear) క్రోమోజోములు ఉంటాయి. D.N.A. వీటిపై ప్రోటీన్ తొడుగు కలిసి క్రోమోజోములను ఏర్పరుస్తాయి. మైటోకాండ్రియాలు కార్బోహైడ్రేట్లను, కొవ్వులను విచ్ఛిన్నం చేసి శక్తిని ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి, వీటిని కణశక్తి భాండాగారాలు అంటారు. D.N.A. కేంద్రకంలోనే కాకుండా మైటోకాండ్రియా, హరితరేణువులలో ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని స్వయంప్రతిపత్తి కలిగిన కణాంగాలు అని అంటారు.

లైసోజోమ్ లు (Lysosomes)  గుండ్రంగా, ఒకే త్వచంతో కప్పి ఉంటాయి. వీటిలో అనేక ఎంజైమ్లు ఉండి, సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మార్చడానికి ఉపయోగపడతాయి. కణం చనిపోయిన తర్వాత వీటిలోని ఎంజైమ్లు కణాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఉపయోగపడతాయి. కాబట్టి, వీటిని కణ ఆత్మహత్యా కోశాలు లేదా కణ ఆటంబాంబులు అంటారు.

రైబోజోమ్ లు (Ribosomes) గోళాకారంగా ఉండే నిర్మాణాలు. ఇవి రైబోకేంద్రకామ్ల (ఆర్.ఎన్.ఎ.) ప్రొటీన్లతో నిర్మితమై ఉంటాయి. కాబట్టి, వీటిని రైబో న్యూక్లియో ప్రొటీన్ రేణువులంటారు. రైబోజోమ్లు కణంలో స్వేచ్ఛగా లేదా అంతర్జీవ ద్రవ్యజాలానికి అతికి ఉంటాయి. గుంపులుగా ఉన్న రైబోజోమ్లనే పాలిజోమ్లు (polysomes) అంటారు. ఇవి ప్రొటీన్ల సంశ్లేషణకు ఉపయోగపడతాయి.

కణంలో నాళాలు, తిత్తుల్లాంటి నిర్మాణాలున్న కణాంగం అంతర్జీవ ద్రవ్యజాలం. ఇది రెండు రకాలు. అవి: 1) నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. 2) గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం. దీనిపై రైబోజోమ్లు అతుక్కుని ఉంటాయి. ఇది ప్రొటీన్ల సంశ్లేషణకు తోడ్పడుతుంది. కణంలో నాళాల మాదిరి ఉండే మరో నిర్మాణం గాల్జి సంక్లిష్టం. ఇది కూడా ప్రొటీన్ల సంశ్లేషణకు తోడ్పడుతుంది. తంతువులతో నిర్మితమై, కణమంతా వ్యాపించి ఉండే నిర్మాణాన్ని కణద్రవ్య పంజరం అంటారు. ఇది కణానికి యాంత్రికబలాన్ని ఇస్తుంది.

కణాంగాల్లో అన్నింటికంటే ముఖ్యమైంది కేంద్రకం(Nuclear). ఇది రెండు పొరలతో కప్పి ఉంటుంది. ఈ పొరను కేంద్రకత్వచం అంటారు. కేంద్రకం లోపల ఉన్న పోగుల్లాంటి నిర్మాణాలను క్రోమాటిన్ పదార్థం అంటారు. ఇది కణవిభజన సమయంలో క్రోమోజోమ్లుగా మారుతుంది. క్రోమాటిన్ లేదా క్రోమోజోమ్లు డి.ఎన్.ఎ. ప్రోటీన్లతో నిర్మితమై ఉంటాయి. డి.ఎన్.ఎ. లో జన్యువులు ఉంటాయి. ఇవి నిర్ణీత లక్షణాలను నియంత్రిస్తాయి.

కేంద్రకం కణంలోని అన్ని జీవక్రియలను తన అధీనంలో ఉంచుకుంటుంది. నిర్దిష్ట కేంద్రకం ఉండే జీవులను నిజకేంద్రక కణాలని, నిర్దిష్ట కేంద్రకం లేని జీవులను కేంద్రక పూర్వజీవులని అంటారు.కిరణజన్య సంయోగక్రియ

ఆకుపచ్చని మొక్కలు నీటిని, కార్బన్ డై ఆక్సైడ్ ను వినియోగించుకుని కాంతి, క్లోరోఫిల్ సహాయంతో గ్లూకోజ్ లేదా కార్బోహైడ్రేట్లను తయారుచేసుకునే క్రియను కిరణజన్య సంయోగక్రియ అంటారు. ఈ చర్య ఒక కాంతి రసాయన చర్య. మొక్కల్లోని ఆకుపచ్చ భాగాలైన పత్రాల్లో కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. కాబట్టి, పత్రాన్ని ఆహార కర్మాగారం లేదా ఆహార ఉత్పాదక భాగంగా పిలుస్తారు. పత్రం నిర్మాణం కిరణజన్య సంయోగక్రియ జరగడానికి అనుకూలంగా ఉంటుంది. దీనిలోని కణాల్లో హరిత రేణువులనే కణాంగాలు ఉంటాయి. వీటిలో కిరణజన్య సంయోగక్రియకు సంబంధించిన చర్యలు జరుగుతాయి. పత్రంలోని పత్ర రంధ్రాల ద్వారా కార్బన్ డై ఆక్సైడ్, ఆక్సిజన్ ప్రసారం జరుగుతుంది. కిరణజన్య సంయోగ క్రియ చర్యను మొత్తం కింది సమీకరణం ద్వారా సూచించవచ్చు.

పై చర్యలో కార్బన్ డై ఆక్సైడ్ చివరికి గ్లూకోజ్ గా మారుతుంది. కాంతి నీటిని విశ్లేషిస్తుంది. దీంతో నీటి నుంచి ఆక్సిజన్ వెలువడుతుంది. ఈ ప్రక్రియను నీటి కాంతి విశ్లేషన అంటారు. కిరణజన్య సంయోగక్రియకు అవసరమైన పత్రహరితం అనేది ఒక వర్ణద్రవ్యం. మొక్కలు ఆకుపచ్చగా ఉండటానికి కారణం ఇదే. పత్రహరితంలో ఉండే మూలకం మెగ్నీషియం.

హరితరేణువులో పత్రహరితంతో పాటు ఇతర వర్ణద్రవ్యాలు ఉంటాయి. ఇవి ఒక సమూహంగా హరితరేణువులో దొంతరలుగా ఉండే థైలకాయిడ్ల పొరలో అమరి ఉంటాయి. వర్ణ ద్రవ్య సహూహాలు చర్యా కేంద్రాలుగా నిర్మతమై ఉంటాయి. ఈ కేంద్రాలు కాంతిచర్యావ్యవస్థ-1, కాంతిచర్యావ్యవస్థ- II అనే రకాలుగా ఉంటాయి. ఈ చర్యాకేంద్రాల్లో ఉన్న వర్ణద్రవ్యాలు కాంతిని గ్రహిస్తాయి. వర్ణద్రవ్యాల్లో పత్రహరితం మాత్రమే కాంతిని ఉపయోగించుకుంటుంది. ఇతర వర్ణద్రవ్యాలు పత్రహరితాన్ని కాంతి తీక్షణత నుంచి రక్షిస్తాయి. కాబట్టి, వీటిని రక్షక వర్ణ ద్రవ్యాలు అంటారు.

కిరణజన్య సంయోగక్రియలో జరిగే చర్యలను రెండు రకాలుగా విభజించవచ్చు. అవి 1) కాంతి చర్యలు, 2) నిష్కాంతి చర్యలు. కాంతి చర్యలు కాంతి సమక్షంలోనే జరుగుతాయి. కాంతి కిరణాలు ఫోటాన్లనే రేణువులు. ఫోటాన్లలో ఉండే శక్తిని క్వాంటమ్ శక్తి అంటారు. చర్యా కేంద్రాల్లో ఉన్న పత్రహరితం కాంతిని శోషించి ఫోటాన్లలో ఉండే శక్తిని గ్రహిస్తుంది. దీనివల్ల పత్రహరితంలోని ఎలక్ట్రాన్ అధిక శక్తి స్థాయికి వెళుతుంది. ఎలక్ట్రాన్ గ్రహీతలు దీన్నుంచి ఎలక్ట్రాన్లను తీసుకుంటాయి. సైటోక్రోములు, ప్లాస్టోక్వినోన్లు, ఫెర్రిడాక్సిన్లు వంటివి ఎలక్ట్రాన్ వాహకాలుగా పని చేస్తాయి. ఎలక్ట్రాన్ వాహకాల ద్వారా ఎలక్ట్రాన్ల రవాణా, నీటి విశ్లేషణ జరగడంతో ప్రోటాన్లు

థైలకాయిడ్ పొర నుంచి అవర్ణికలోకి చేరతాయి. దీనివల్ల కార్బన్ డై ఆక్సైడ్ గ్లూకోజ్ గా మారడానికి అవసరమైన శక్తి ఏర్పడుతుంది. ఈ శక్తి ఆడినో సైన్ ట్రై పాస్ఫేట్ (ఎ.టి.పి), నికోటినమైడ్ అడినిన్ డై న్యూక్లియోటైడ్ పాస్ఫేట్ (ఎన్.ఎ.డి.పి. హెచ్) రూపంలో ఉంటుంది. కాంతి చర్యల్లో కేవలం శక్తి మాత్రమే ఏర్పడుతుంది. గ్లూకోజ్ ఏర్పడదు.

నిష్కాంతి చర్యల్లో కార్బన్ డై ఆక్సైడ్ వినియోగమై గ్లూకోజ్ గా మారుతుంది. ఈ చర్యలకు కాంతి అవసరం లేదు. అంటే, ఇవి కాంతి ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా జరుగుతాయి. ఈ చర్యలన్నీ హరిత రేణువులోని ఆవర్ణికలో జరుగుతాయి. వీటిని గుర్తించింది మెల్విన్ కాల్విన్ అనే శాస్త్రవేత్త. కాబట్టి, ఈ వలయరూపంలో జరిగే చర్యలను నోబెల్ బహుమతి లభించింది. నిష్కాంతి చర్యల్లో మొదట కార్బన్ డై ఆక్సైడ్ ను రిబ్యులోజ్ బిస్ పాస్ఫేట్ అనే పదార్థం గ్రహిస్తుంది. దీనివల్ల మొదట ఆరు కర్బన పరమాణువుల అస్థిర పదార్థం ఏర్పడి, వెంటనే స్థిర పదార్థమైన మూడు కర్బన పరమాణువులు ఉన్న పాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అనే పదార్థంగా మారుతుంది. ఇది కొన్ని చర్యల తరువాత గ్లిజరాల్డిహైడ్-3-పాస్ఫేట్ అనే పదార్థంగా మారుతుంది. దీన్నుంచి గ్లూకోజ్ ఏర్పడుతుంది. రిబ్యులోజ్ బిస్ పాస్ఫేట్ పునరుద్ధరణ జరుగుతుంది. ఇలా చర్యలన్నీ వలయరూపంలో జరుగుతాయి. కాంతి చర్యలో చివరికి ఏర్పడిన గ్లూకోజ్ పిండిపదార్థంగా మారుతుంది. కిరణజన్య సంయోగక్రియ నిర్మాణాత్మక చర్య. దీనిలో పదార్థాలు తయారవుతాయి. ఈ కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని హైడ్రిల్లా మొక్క ద్వారా నిరూపించవచ్చు. అయోడిన్ పరీక్ష ద్వారా పిండిపదార్థం ఏర్పడుతుందని తెలుస్తుంది. లైట్ స్క్రీన్ ప్రయోగం ద్వారా కిరణజన్య సంయోగక్రియకు కాంతి అవసరమని, ఆకు సగభాగంతో చేసే ప్రయోగం ద్వారా కార్బన్ డై ఆక్సైడ్ అవసరమని నిరూపించవచ్చు.మొక్కల వర్గీకరణ

మొక్కల వర్గీకరణ

భూమిపై ఉండే మొక్కలను పుష్పించే లక్షణాన్ని ఆధారంగా చేసుకుని రెండు విభాగాలుగా విభజించారు. అవి: 1) పుష్పించని మొక్కలు లేదా క్రిప్టోగాములు, 2) పుష్పించే మొక్కలు లేదా ఫానిరోగాములు. పుష్పించని మొక్కలు ప్రాథమికమైనవి. వీటిని తిరిగి థాలో ఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా అనే రకాలుగా విభజించారు. 

థాలో ఫైటా

కాండం, వేరు, పత్రాలు అనే నిర్మాణాలు నిర్దిష్టంగా ఉండని వాటిని థాలో ఫైటా మొక్కలు అంటారు. శైవలాలు, శిలీంద్రాలు థాలో ఫైటాకు చెందుతాయి. శైవలాలు ఎక్కువగా నీటిలో నివసిస్తాయి. ఇవి స్వయం పోషకాలు. క్లామిడోమోనాస్, స్పైరోగైరా, వాల్వాక్స్ లాంటివి శైవలాలకు ఉదాహరణ. శిలీంద్రాలు పరపోషిత థాలో ఫైటా జీవులు ఈస్ట్, బూజులు వీటికి ఉదాహరణ.

బ్రయోఫైటా 

ఈ మొక్కలు తడిగోడలు, తడినేల మీద పెరుగుతాయి. ఇవి దట్టంగా తివాచీలా లేదా వెల్వెట్ వస్త్రంలా మెత్తగా ఉంటాయి. ఈ మొక్కల కాండం నుంచి మూల తంతువులు లేదా వైజాయిడ్లు అనే నిర్మాణాలు ఏర్పడతాయి. ఇవి భూమిలోని లవణాలను, నీటిని గ్రహిస్తాయి. వీటి పురుష ప్రత్యుత్పత్తి అవయవాలను ఆంథరీడియా, స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలను ఆర్కిగోనియా అంటారు. బ్రయోఫైటా మొక్కలను సాధారణంగా మాస్ మొక్కలని పిలుస్తారు.

టెరిడోఫైటా

ఈ  మొక్కలు మరింత స్పష్టంగా వేరు, కాండం, పత్రాలు అనే నిర్మాణాలు ఉంటాయి. కాండం నుంచి అబ్బురపు వేర్లు ఉర్భవిస్తాయి. టెరిడోఫైటా మొక్కలను సాధారణంగా ఫెర్లు అంటారు. వీటి పత్రాలను ఫ్రాండ్సు అంటారు. వీటి అడుగు భాగాన సిద్ధబీజాశయ పుంజం (సోరస్) ఏర్పడి వీటిలో సిద్ధబీజాశయాలు ఏర్పడతాయి. వీటి జీవితచక్రంలో సిద్ధబీజాలను ఏర్పరుస్తాయి. ఫెర్న్ మొక్కలను ఎక్కువగా అలంకరణ కోసం పెంచుతారు.

పుష్పించే మొక్కలను ఫలాలు లేదా విత్తనాలు ఏర్పడే స్థానాన్ని బట్టి రెండు రకాలుగా విభజించారు. అవి: 1) వివృత బీజాలు లేదా జిమ్నో స్పర్ములు 2) అవృత బీజాలు లేదా ఆంజియోస్పర్ములు. వివృత బీజ మొక్కలను నగ్న విత్తనాలున్న మొక్కలు అంటారు. ఇవి విత్తనాలను నేరుగా మొక్కపై ఉత్పత్తి చేస్తాయి. వీటిలోని పుష్పాలను శంకువులు లేదా కోన్స్ అంటారు. సైకస్, నీటమ్ లాంటివి వివృతబీజ మొక్కలకు ఉదాహరణ.

బీజదళాల సంఖ్యను బట్టి ఆవృతబీజాలను తిరిగి రెండు రకాలుగా విభజించారు. అవి: 1) ద్విదళ బీజాలు 2) ఏకదళ బీజాలు. ద్విదళ బీజ విత్తనాల్లో రెండు బీజదళాలు ఉంటాయి. వీటిలో తల్లివేరు వ్యవస్థ ఉంటుంది. చిక్కుడు, మామిడి, టొమాటో మొదలైనవి వీటికి ఉదాహరణ. ఏకదళ బీజ విత్తనాల్లో ఒకే బీజదళం ఉంటుంది. వీటిలో పీచువేరు వ్యవస్థ ఉంటుంది. వరి, గోధుమ, జొన్న, కొబ్బరి లాంటివి ఏకదళ బీజ మొక్కలకు ఉదాహరణ. ఆవృత బీజాల నుంచే మానవుడికి అవసరమైన ఆహార పదార్థాలు, దుస్తులు లాంటివి సమకూరుతున్నాయి.

మొక్కలు - ఉపయోగాలు

మొక్కలు మానవుడికి ప్రాథమిక అవసరాలైన ఆహారం, ఔషధాలు, దుస్తులు లాంటివి సమకూరుస్తున్నాయి. అనేక రకాల మొక్కలను మానవుడు సాగుచేసి తన అవసరానికి వినియోగించుకుంటున్నాడు. ప్రస్తుతం సాగు చేస్తున్న మొక్కలన్నీ వన్యజాతి మొక్కల నుంచి ఉద్భవించినవే. మానవుడి రక్షణ, సహాయం పొందకుండా నివసించే మొక్కలను వన్యజాతి మొక్కలంటారు. ఇవి సాగు మొక్కలతో పోల్చితే ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునే విధంగా ఉంటాయి. ఈ మొక్కలకు వ్యాధి నిరోధకశక్తి ఎక్కువగా ఉంటుంది. మొక్కల నుంచి లభ్యమయ్యే ఉత్పత్తులనుబట్టి వీటిని ధాన్యాలు, నార, ఔషధాలు, కలపనిచ్చే మొక్కలని విభజించవచ్చు. 

ధాన్యాలనిచ్చే మొక్కలు

మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా ఉపయోగపడేవి ధాన్యాలు. ఇవి గడ్డిజాతి మొక్కలు. గింజల్లో ఆహార పదార్థాలను నిల్వ చేసుకుంటాయి. వీటిలో పిండి పదార్థాలు ఎక్కువగా, తక్కువ మొత్తంలో ప్రోటీన్లు, విటమిన్లు ఉంటాయి. వరి, గోధుమ, జొన్న, సజ్జ, మొక్కజొన్న లాంటివి ధాన్యాలను ఇచ్చే మొక్కలు.

ప్రపంచంలో సగం కంటే ఎక్కువ జనాభాకు వరి ముఖ్య ఆహార పదార్థం. వరి ఏకవార్షిక మొక్క. ఇది గడ్డి జాతికి చెందింది. ఆసియా, యూరప్, అమెరికాల్లో పండించే వరిని ఒరైజా సటైవా అనే శాస్త్రీయ నామంతో పిలుస్తారు. వీటిలో జపానిక, ఇండిక, జవానిక అనే మూడు ఉపజాతులు ఉన్నాయి. మనదేశంలో ఇండికా ఉపజాతి రకాన్ని సాగుచేస్తున్నారు. వరిని అన్నంగా తినడంతో పాటు దీనితో పిండివంటలు, ఇడ్లీ, దోసె లాంటి వాటిని తయారుచేస్తారు. వడ్లను వేడినీటిలో ఉడికించి ఎండబెట్టి, మిల్లు ఆడించి ఉప్పుడు బియ్యాన్ని తయారు చేస్తారు. తవుడు నుంచి వచ్చిన నూనె వంటల్లో ఉపయోగపడుతుంది. వరిగడ్డిని పశువుల మేతగా, ఊకను ఇటుకలను కాల్చడానికి ఉపయోగిస్తారు. స్థానికంగా వరిలో హంస, జయ, మసూరి, ఫల్గుణ లాంటి రకాలు ఉన్నాయి. భారత దేశంలోని కటక్ లో ఉన్న ఇండియన్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లోను, ఫిలిప్పైన్స్ లోని మనిలాలో ఉన్న ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో వరికి సంబంధించిన పరిశోధనలు జరుగుతున్నాయి.

వరి తర్వాత ఎక్కువగా ఉపయోగపడుతున్న మరో ధాన్యపు మొక్క గోధుమ. దీని శాస్త్రీయనామం ట్రిటికమ్ వల్గేర్. గోధుమ పిండిని చపాతీ, పూరి లాంటివి తయారు చేయడానికి ఉపయోగిస్తారు. గోధుమ గడ్డిని పశువుల మేతగాను, ఇంటికప్పులకు, ప్యాకింగ్ పరిశ్రమలోను ఉపయోగిస్తారు. ట్రిటికమ్ ఏస్టివమ్ అనే గోధుమ రకాన్ని బ్రెడ్ వీట్ అని అంటారు. మొక్కజొన్న శాస్త్రీయనామం జియామేస్. దీన్ని ఆహారంగా, పశుగ్రాసంగా ఉపయోగిస్తారు. ఆల్కహాల్, ప్లాస్టిక్ లాంటి వాటి తయారీలో కూడా మొక్కజొన్న ఉపయోగపడుతుంది. ధాన్యాల్లో చిన్నగింజలతో కూడిన జొన్నలు, సజ్జలు, రాగులు లాంటి వాటిని చిరుధాన్యలు అంటారు.

మాంసకృత్తులు, నూనెల మొక్కలు

పప్పు ధాన్యాలు లేదా అపరాల్లో మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి. శాకాహారులకు మాంసకృత్తులు వీటి నుంచే లభిస్తాయి. మాంసకృత్తులు శరీరం పెరుగుదలకు, నిర్మాణానికి అవసరం. పెసర, మినుము, కంది లాంటివి వీటికి ఉదాహరణ. నిత్యజీవితంలో ఉపయోగించే వంట నునెలు వేరుశెనగ, సన్ ఫ్లవర్, పామాయిల్, కొబ్బరి, నువ్వులు లాంటి మొక్కల నుంచి లభ్యమవుతాయి. వీటిలో సఫ్లవర్ నూనె అసంతృప్త కొవ్వు ఆమ్లాలతో ఉంటుంది. దీనివల్ల రక్తంలో కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండి గుండె సంబంధ జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఈ నూనెలే కాకుండా మొక్కల నుంచి సువాసన నిచ్చే నూనెలు కూడా లభ్యమవుతాయి. నిమ్మ, లావెండరు నూనెలు, కర్పూరతైలం మొదలైనవి వీటికి ఉదాహరణ. వేపగింజల నుంచి వచ్చిన నూనె సూక్ష్మజీవ నాశకంగా ఉపయోగపడుతుంది. 

కలప, నారల మొక్కలు

కలప సాధారణంగా గృహనిర్మాణాలకు, గృహోపకరణాలకు, వ్యవసాయ పనిముట్లకు, పడవలు, వాహనాల తయారీకి ఉపయోగిస్తారు. రోజ్ వుడ్, సాలు, టేకు, వేపలాంటివి కలపనిచ్చే మొక్కలు. మొక్కలతో ఉత్పత్తి అయ్యే సన్నని పొడవాటి కేశాల లాంటి నిర్మాణాలను నార లేదా పీచు అంటారు. ఇవి మందమైన గోడలతో ఉండే నిర్జీవ కణాలు. గాసిపియం జాతికి చెందిన మొక్క పత్తి గింజల నుంచి మృదువైన కేశాల లాంటి పోగులు ఏర్పడతాయి. వీటిని దారాలుగా మార్చి వస్త్రాలు తయారుచేయడానికి ఉపయోగిస్తారు. క్రొటాలేరియా జంషియా అనే మొక్క నుంచి జనపనార లభిస్తుంది. దీన్ని గోనెసంచులు, వలలు, తాళ్ల తయారీకి ఉపయోగిస్తారు. హైబిస్కస్ కెన్నాబినస్ అనే మొక్క నుంచి గోగునార లభిస్తుంది. దీన్ని కూడా గోనె సంచులు, తాళ్ల తయారీకి వాడతారు. కొబ్బరి శాస్త్రీయ నామం కోకస్ న్యూసిఫెరా. దీని ఫలాల నుంచి కొబ్బరి నార లభిస్తుంది. దీన్ని తాళ్లు, బ్రష్ లు, సంచుల తయారీకి వాడతారు. ఈ నారతో కుషన్లు, పరువులు, దిండ్లు లాంటి వాటిని తయారుచేస్తారు. 

ఔషధ మొక్కలు

మొక్కలు తాము తయారు చేసుకున్న రసాయన పదార్థాలను పత్రాలు, బెరడు, ఫలాలు, విత్తనాలు లాంటి భాగాల్లో నిల్వ చేసుకుంటాయి. వీటిని మనం నేరుగాగాని, శుద్ధిచేసిగాని ఔషధాలుగా ఉపయోగిస్తున్నాం. ఆయుర్వేద వైద్య విధానంలో మొక్కల నుంచి వచ్చే ఔషధాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది.

వంటల్లో వాడే సుగంధ ద్రవ్యాలు వివిధ మొక్కలను లవంగాలుగా వాడతారు. దాల్చిన మొక్క ఎండబెట్టిన బెరడును దాల్చిన చెక్కగా వాడతారు. కుంకుమ పువ్వు (సాఫ్రాన్)ను కీలం, కీలాగ్రం నుంచి సంగ్రహిస్తారు. ఇంగువను ఇంగువ మొక్క వేరు నుంచి సేకరించిన స్రావంతో తయారుచేస్తారు. సుగంధ ద్రవ్యాల్లో మిరియాలను సుగంధ ద్రవ్యాల రాజు (కింగ్ ఆఫ్ స్పైసిస్) లేదా బ్లాక్ గోల్డ్ ఆఫ్ ఇండియా అంటారు. యాలకులను సుగంధ ద్రవ్యాల రాణి (క్వీన్ ఆఫ్ స్మైసిస్) అంటారు. శిలాజ ఇంధనాలైన బొగ్గు, పెట్రోలియంలు కూడా పరోక్షంగా మొక్కల నుంచి లభిస్తాయి. కొన్నివేల సంవత్సరాల కిందట మొక్కలు భూమిలోకి కుంగి మట్టితో కప్పబడి పాక్షికంగా దహనం చెందడం, ఒత్తిడి కారణంగా శిలాజ ఇంధనాలుగా ఏర్పడ్డాయి.

వ్యవసాయ జీవశాస్త్రం

మొక్కల్లో పిండి పదార్థం తయారు కావడానికి, రోగ నిరోధకశక్తి ఏర్పడేందుకు, అధిక వేడి, చల్లదనాన్ని తట్టుకోవడానికి పొటాషియం తోడ్పడుతుంది. పొటాషియం లోపం వల్ల ఆకుల్లో తెల్లవి మచ్చలు ఏర్పడతాయి. ఆకులు ముడతలు పడి వాటి అంచులు ఎండిపోతాయి. ఏ పోషక పదార్థం లేకపోయినా మొక్కల్లో పెరుగుదల లోపిస్తుంది. మొక్కలకు కావలసిన పోషక లవణాలను ఇచ్చే పదార్థాలను ఎరువులు అంటారు. ఇవి రెండు రకాలు. 1) సహజ లేదా స్వాభావిక ఎరువులు, 2) కృత్రిమ లేదా రసాయనిక ఎరువులు. సహజ ఎరువులు ప్రకృతిలో దొరికే పదార్థాలతో తయారవుతాయి. పశువుల వెంట, కంపోస్టు, గింజల నుంచి నూనె తీయగా మిగిలిన పిండి, ఎముకల పొడి మొదలైనవి వీటికి ఉదాహరణ. సహజ ఎరువులు లవణాలను భూమిలోకి విడుదల చేయడానికి కొంత సమయం అవసరం. కర్మాగారాల్లో రసాయన పదార్థాలతో తయారు చేసిన వాటిని రసాయనిక ఎరువులు అంటారు. ఇవి లవణాలను తొందరగా మొక్కకు అందిస్తాయి. అమోనియం సల్ఫేటు, యూరియా, సూపర్ ఫాస్పేటు వంటివి రసాయన ఎరువులకు ఉదాహరణ. రసాయనిక ఎరువుల్లో మిశ్రమ ఎరువులు ఒకటి కంటే ఎక్కువ పోషక పదార్థాలను మొక్కలకు అందిస్తాయి. ఎరువులు వేసినప్పుడు మొక్కలకు తగినంత నీటిని సరఫరా చేయాలి.

మొక్కలను ఆశించే కీటకాలను నివారించే పదార్థాలను కీటక నాశనులు (పెస్టిసైడ్లు) అంటారు. బాక్టీరియాలను నివారించడానికి వాడే పదార్థాలను బ్యాక్టీరియోసైడ్లు అని బూజులను (శిలీంధ్రాలను) నివారించేవాటిని ఫంగిసైడ్లు అంటారు. బ్రాడ్ కాస్టింగ్ పద్ధతిలో విత్తడానికి దున్నిన నేలలో విత్తనాలను వెదజల్లుతారు. ఇవి మొలకెత్తిన తరువాత ఒత్తుగా ఉన్న చోటు నుంచి వీటిని తీసివేసి, ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో నాటుతారు. పప్పులు, వేరుశనగ గింజలను ఈ పద్దతిలో విత్తుతారు. 

కలుపు మొక్కల నివారణ:

సాగు మొక్కలతో పాటు పోటీ పడి పెరిగే అవసరం లేని మొక్కలను కలుపు మొక్కలు అంటారు. వీటిని భౌతిక, రసాయనిక, జీవ పద్ధతుల ద్వారా నియంత్రిస్తారు. దున్నడం, పనిముట్లతో పెరికి వేయడం, చేత్తో తీసివేయడం వంటివి భౌతిక పద్దతులు. రసాయనిక పద్ధతుల్లో కలుపు మొక్కలను నాశనం చేయడానికి ఉపయోగపడే రసాయనాలను గుల్మనాశకాలు లేదా హెర్బిసైడ్స్ అంటారు. 2, 4 - డైక్లోరోఫినాక్సి ఎసిటిక్ ఆమ్లం (2, 4-D) అనేది వీటికి ఉదాహరణ. జీవక్రియా పద్ధతుల్లో కలుపు మొక్కలను సహజ శత్రువులైన కీటకాలను ప్రవేశపెట్టి నాశనం చేస్తారు. పంటమార్పిడి విధానం ద్వారా కూడా కలుపు మొక్కలను నియంత్రించవచ్చు. 

తెగుళ్లు-నియంత్రణ:

వివిధ పంట మొక్కలకు బాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్లు, కీటకాల వల్ల అనేక తెగుళ్లు వస్తాయి. కీటకాలు, గొంగళి పురుగు దశలో మొక్కలకు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. ఇవి మెత్తటి ఆకులను తినేస్తాయి. కాండాలను, కాయలను గొంగళి పురుగులు తొలచివేస్తాయి. తెగుళ్లను నియంత్రించడానికి పొడి రూపంలో ఉండే మందులను డస్టర్ అనే సాధనంతో, ద్రవ రూపంలో ఉండే మందులను ప్రేయర్ అనే సాధనంతో చల్లుతారు. విత్తనాలను విత్తేముందు రసాయనాలతో శుద్ధి చేయడం, తెగులు సోకిన మొక్కలను నాశనం చేయడం, పంట మార్పిడి చేయడం కలుపు మొక్కలను ఏరివేయడం, వ్యాధి నిరోధక శక్తి ఉన్న మొక్కలను పెంచడం వంటి పద్ధతుల ద్వారా పంటలపై వచ్చే వైరస్, బ్యాక్టీరియా, శిలీంధ్ర వ్యాధులను నియంత్రించవచ్చు. 

మిరపకు సోకే తెగుళ్లు:

మిరప మొక్కకు శిలీంధ్రాలు (ఫంగస్), బ్యాక్టీరియా, కీటకాల వల్ల పలు రకాల తెగుళ్లు సోకుతాయి. 

మిరపను ఆశించే తెగుళ్లు - నివారణ 

ఫంగస్ ద్వారా సోకే తెగుళ్లు

ఎ) మొదలుకుళ్లు తెగులు - తెగులు సోకిన మొక్కలను కాల్చేయాలి 

బి) బూడిద తెగులు - గంధకపు పొడి చల్లాలి

సి) కాయకుళ్లు-కొమ్మఎండుతెగులు - డైతేన్ ఎం-45 మందు చల్లాలి 

బ్యాక్టీరియావల్ల సోకే తెగుళ్లు

ఎ) వేరుపురుగు - వేప పిండిని పొలంలో చల్లాలి 

బి) పేరుబంక - మోనోక్రోటోఫాస్ చల్లాలి

సి) కాయతొలిచే పురుగు - ఎండోసల్ఫాన్ చల్లాలి 

నిమ్మజాతి మొక్కలకు సోకే తెగుళ్లు:

నిమ్మ, నారింజ, బత్తాయి, దానిమ్మ వంటి మొక్కలను నిమ్మజాతి మొక్కలంటారు. వీటి ద్వారా మనకు విటమిన్-సి లభిస్తుంది. చీనీ (బత్తాయి) మొక్కలకు వైరస్ల వల్ల ట్రస్టీజా, మొజాయిక్, ఎల్లో కార్కివీన్ వంటి తెగుళ్లు సంభవిస్తాయి. ట్రస్టీజా తెగులుకు ఏసిడ్స్ అనే కాటకాలు వాహకాలుగా ఉంటాయి. మొజాయిక్ తెగులులో ఆకుల్లో పసుపు రంగులో మచ్చలు ఏర్పడతాయి. ఎల్లో కార్కివీన్ తెగులు కస్క్యూటీ అనే పరాన్న ఔషధ మొక్క వల్ల కూడా వ్యాపిస్తుంది. నిమ్మజాతి మొక్కల్లో జంథోమొనాస్ సిట్రి అనే బాక్టీరియా వల్ల సిట్రస్ కాంకర్ (గజ్జి తెగులు) వస్తుంది. లీ మైనర్, సిట్రస్ బటర్ ఫ్లై, ఏసిడ్స్, నల్లిపురుగులు వంటి కీటకాలు ఈ మొక్కలను ఆశిస్తాయి. వీటి నివారణకు మొనోక్రోటోఫాస్ అనే రసాయనాలను చల్లవచ్చు. 

ద్రాక్ష, కొబ్బరి మొక్కలకు సోకే తెగుళ్లు:

ద్రాక్ష మొక్కలపై శిలీంధ్రం వల్ల డైనీమిల్ డ్యూ అనే తెగులు సోకుతుంది. వేన్ గల్ బీటిల్ అనే కీటకం కాండం చుట్టూ బెరడును తొలిచేస్తుంది. కొబ్బరి చెట్లలో రైనోసిరాస్ బీటిల్ అనే కీటకం కాండం చివర ఉండే లేత ఆకులను, పుష్పాలను నాశనం చేస్తుంది. వైరస్ వల్ల కొబ్బరిలో విక్ట్ అనే తెగులు సోకుతుంది.

పత్తి, చెరకు మొక్కలకు సోకే తెగుళ్లు:

పత్తి మొక్కలను అనేక రకాల కీటకాలు ఆశిస్తాయి. ఈ కీటకాలన్నీ గొంగళి పురుగుదశలో పైరుకు నష్టాన్ని కలిగిస్తాయి. పత్తిని ఆశించే పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక, ఎర్రనల్లి పురుగు వంటివి రసాన్ని పీల్చే పురుగులకు ఉదాహరణ. మచ్చల పురుగు, శనగపచ్చ పురుగు, పొగాకు లద్దెపురుగు, గులాబి రంగు పురుగు వంటివి కాయ తొలిచే పురుగులకు ఉదాహరణ. పత్తిని ఆశించే తెగుళ్లఓ ముఖ్యమైనవి నల్లమచ్చ, వేరుకుళ్లు, ఆకుమచ్చ, ఎండుతెగుళ్లు, చెరకును కాండం తొలిచే పురుగు, పిండినల్లి పొలుసు పురుగు, వేరుపురుగు, దూదేకుల పురుగు వంటివి ఆశించి నష్టాన్ని కలిగిస్తాయి. శిలీంధ్రాల వల్ల కీటక లేదా కొరడా తెగులు, ఎర్రకుళ్లు వంటివి సోకుతాయి.

పరిసరానుగుణ్యత

మొక్కల్లో పరిసరానుగుణ్యత

మొక్కలు వివిధ పరిసరాల్లో నివసిస్తూ అక్కడి పరిస్థితులకు అనుగుణంగా తమ దేహభాగాల్లోను, జీవన విధానాల్లోను మార్పు చేసుకోవడాన్నే పరిసరానుగుణ్యత అంటారు.

నీటిలో ఉండే మొక్కలను మూడు రకాలుగా విభజించవచ్చు. అవి. 1) నీటిపై తేలే మొక్కలు. ఉదాహరణ పిస్టియా (అంతర తామర), ఐకార్నియా, ఉల్ఫియా 2) నీటిలో నాటుకుని పైకి తేలే మొక్కలు. ఇవి వేర్ల సహాయంతో భూమిలో నాటుకుని పొడవైన పత్ర వృంతాల సహాయంతో నీటిపై తేలుతుంటాయి. ఉదాహరణ కలువ, తామర మొక్కలు. 3) పూర్తిగా నీటిలో ఉండే మొక్కలు. వీటికి ఉదాహరణ హైడ్రిల్లా, వాలిస్ నేరియా, యుట్రిక్యులేరియా. ఈ నీటి మొక్కల్లో అనేక అనుకూలనాలు కనిపిస్తాయి. పిస్టియా, ఐకార్నియాల్లో నీటిమీద తేలడానికి సమతూకం జరిపే వేళ్లు ఉన్నాయి. నీటి మొక్కల కాండాల్లో గాలిగదులు ఉండి గాలిని నిల్వ చేస్తాయి. ఇవి మొక్క నీటిపై తేలడానికి ఉపయోగపడతాయి. తామర మొక్క పత్రాలపైన మైనపుపూత ఉంటుంది. ఇది పత్రాలపై నీరు నిల్వ ఉండకుండా, పత్రరంధ్రాలు మూసుకుపోకుండా సహాయపడుతుంది. కొన్ని నీటి మొక్కల్లో పత్రాలు చీలి ఉండి నీటి ప్రవాహానికి అనుగుణంగా ఉంటాయి. నీటి మొక్కల్లో వేరువ్యవస్థ అంతగా అభివృద్ధి చెంది ఉండదు.

ఎడారి మొక్కలు 

నీరు అతి తక్కువగా ఉండే ప్రదేశాల్లో పెరిగే మొక్కలను ఎడారి మొక్కలు అంటారు. నాగజెముడు, కాక్టస్, బ్రయోఫిల్లమ్, కలబంద మొదలైనవి వీటికి ఉదాహరణ. ఈ మొక్కల వేళ్లు లోతుగా ఉన్న నీటిని పీల్చుకోడానికి బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. నాగజెముడు (ఒపన్షియా) మొక్కలో కాండం పైనున్న పత్రాలు బాష్పోత్సేకాన్ని తగ్గించుకోడానికి ముళ్లలా మారి ఉంటాయి. దీనిలో కాండం ఆహారం తయారుచేసుకోవడానికి వీలుగా ఆకుపచ్చగా ఉంటుంది. కలబంద, బ్రయోఫిల్లమ్ మొక్కలు నీటిని పత్రాల్లో నిల్వ చేసుకుంటాయి. మరికొన్ని నీటిని కాండాల్లో నిల్వ చేసుకుంటాయి. ఈ అనుకూలనాలన్నీ నీటి పొదుపుకు సంబంధించినవి. 

జంతువుల్లో పరిసరానుగుణ్యత

వివిధ పరిసరాల్లో నివసించే జంతువులు అక్కడి పరిస్థితులకు అనుకూలంగా తమ శరీర నిర్మాణాన్ని మార్పిడి చేసుకున్నాయి. నీటిలో నివసించే చేపలకు నీటిలో కరిగిన ఆక్సిజనను పీల్చుకోవడానికి మొప్పలు ఉన్నాయి. వీటి శరీరం నీటిలో చలనానికి ఉపయుక్తంగా ఉంటుంది. చేపలోని తోక దిశను మార్చుకోవడానికి, రెక్కలు సమతాస్థితిని నిలపడానికి, ఈదడానికి ఉపయోగపడతాయి. కప్ప నీటిలో, నేలపైన నివసిస్తుంది. కాబట్టి దీన్ని ఉభయజీవి అంటారు. కప్పకు ఉండే రెండు జతల కాళ్లు నేలపై దుమకడానికి ఉపయోగపడుతుంది. వెనక కాళ్ల మధ్య ఉండే చర్మం తెడ్లలా పనిచేసి నీటిలో ఈదడానికి సహాయపడుతుంది. కప్పకు నేల మీద శ్వాసించడానికి ఒక జత ఊపిరితుత్తులు ఉంటాయి. నీటిలో ఉన్నప్పుడు తడిగా ఉండే చర్మం సహాయంతో శ్వాసిస్తుంది. పాముల శరీరంపై ఉండే పొలుసులు పాకడానికి సహాయపడతాయి. పక్షుల్లో ముందరి జత చలనాంగాలు రెక్కలుగా మారి గాలిలో ఎగరడానికి ఉపయోగపడతాయి. రెక్కల్లో ఉండే ఈకలు గాలిని అడ్డుకుని తెరచాపలా ఉంటాయి. ఎముకలు బోలుగా గాలితో నిండి ఉండి శరీర బరువు తగ్గించడానికి, తేలికగా ఎగరడానికి అనుకూలంగా ఉంటాయి. ఎడారిలో నివసించే జంతువులు తమ శరీరం ద్వారా నీటిని నష్ట పోకుండా అనేక అనుకూలనాలను చూపుతాయి. ఒంటె ఆహారం దొరికినప్పుడు ఎక్కువగా తిని జీర్ణమైన ఆహారాన్ని కొవ్వు రూపంలో దాచుకుంటుంది. ఆహారం దొరకనప్పుడు దీనిని కరిగించుకుని శక్తిని, నీటిని పొందుతుంది. నీటిని కూడా నేరుగా తన శరీరంలో దాచుకుంటుంది. శరీరంపై వెంట్రుకలుంటాయి. స్వేద రంధ్రాలు ఉండవు. దీనివల్ల ఒంటెకు చెమట పట్టదు. ఇసుక ముక్క రంధ్రాల్లో దూరకుండా అవి సన్నగా, లోపల ఉంటాయి. కనురెప్పలు ముందుకు వచ్చి ఇసుక నుంచి కాపాడతాయి. పాదాల అడుగున వెడలైన మెత్తలు ఉండి ఇసుకలో నడపడానికి అనుకూలంగా ఉంటాయి. ఈ రకమైన అనుకూలనాలు ఉండడం వల్ల ఒంటెను ఎడారి ఓడ అంటారు.

ధ్రువ ప్రాంతాల్లో ఉండే జంతువులైన ధ్రువపు ఎలుగు బంట్లు, సీళ్లు, పెంగ్విన్లు కూడా అనేక అనుకూలనాలను చూపుతాయి. వీటిలో ధ్రువపు ఎలుగుబంటి శరీరంపై ఉన్న దట్టమైన ఉన్ని శరీరం నుంచి వేడి బయటకు పోకుండా, బయటి చలి శరీరానికి తగలకుండా కాపాడుతుంది. పాదాల అడుగున ఉన్న వెంట్రుకలు మంచుపై నిలదొక్కుకోవడానికి, ముందరి పాదాల మధ్య ఉన్న చర్మం ఈదడానికి ఉపయోగపడతాయి. శీతాకాలంలో అధిక చలి నుంచి రక్షించుకోవడానికి ఇవి శీతాకాలపు నిద్రను చూపిస్తాయి. ఈ సమయంలో ఇవి కదలకుండా పడుకుని శ్వాసక్రియను నెమ్మదిగా జరుపుకొంటూ నిల్వ ఉన్న కొవ్వును శరీర అవసరాలకు వాడుకుంటాయి.

పశుసంపద

ఆవులు, ఎడ్లను తెల్లజాతి, దున్నలు, గెదెలను నల్లజాతి పశువులని అంటారు. పశువుల నుంచి మనకు పాలు, మాంసం లభిస్తాయి. పాల ఉత్పత్తిని పెంచడం కోసం భారత ప్రభుత్వం ఆపరేషన్ ఫ్లడ్ లేదా వైట్ రెవల్యూషన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఒంగోలు జాతి, హర్యానా జాతి పశువులు మన దేశంలో ఉండే తెల్లజాతి పశువులు. ఒంగోలు జాతి పశువులు అధిక వాతావరణ ఉష్ణోగ్రతను విషజ్వరాలను తట్టుకుంటాయి. ఇంగ్లండ్ కు చెందిన జెర్సీ ఆవులను, డెన్మార్క్ కు చెందిన హాల్ స్టీన్ ఆవులను మన దేశంలోని ఆవులతో సంకర పరచి సంకరజాతి ఆవులను సృష్టించారు. ఇవి పాలను అధికంగా ఇస్తాయి.

ఆవుపాలకంటే గేదెపాలలో ఎక్కువ కొవ్వులు ఉంటాయి కాబట్టి, పాల పదార్థాలు తయారు చేయడానికి గేదెపాలు అనుకూలమైనవి. ఆవుల కంటే గేదెలు వ్యాధులను ఎక్కువగా తట్టుకుంటాయి. మనదేశంలో ముర్రా, భద్వారి, జఫ్రాబాడి, సుర్తి, మేష్న, నాగ పూరి, నీలిరావి వంటి గేదె జాతులు ఉన్నాయి. వీటిలో ముర్రాజాతి గేదెలు ఎక్కువ పాలను ఇస్తాయి. పశుగ్రాసాల కోసం నేపియర్ గడ్డి, పారాగడ్డి వంటి వాటిని పెంచుతారు. తీపిజొన్న, లూస్నర్, జనుము, వంటివి కూడా పశుగ్రాసంగా ఉపయోగపడతాయి. పెరుగుదలకు, శరీరాభివృద్ధికి కావలసిన మాంసకృత్తులు, కొవ్వులు, పిండిపదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉండటం వల్ల పాలను సంపూర్ణాహారం అంటారు.

సాధారణ పద్ధతుల్లో సంకరజాతి పశువులను ఉత్పత్తి చేయడంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించం కోసం కృత్రిమ గర్భధారణ, సూపర్ ఓవ్యులేషన్, పిండిమార్పిడి అనే విధానాలను అనుసరిస్తున్నారు. కృత్రిమ గర్భధారణలో ఎద్దుల నుంచి సేకరించిన శుక్లాన్ని-180°C వద్ద నత్రజని ద్రావణంలో మొదట నిల్వ చేస్తారు. దీన్ని సాధారణ ఉష్ణోగ్రతకు తీసుకువచ్చి ఆవుల్లోకి ప్రవేశపెడతారు. ఆవు నుంచి ఒకేసారి అనేక అండాలను విడుదల చేయడానికి గర్భంతో ఉన్న ఆడ గుర్రాల రక్తం నుంచి సేకరించిన సీరమ్ గొనాడో ట్రాపిన్ అనే హార్మోన్ ను ఎక్కిస్తారు. ఇలా వచ్చిన అండాలను కృత్రిమ ఫలదీకరణ జరిపి పిండాలను మరో ఆవులోకి ప్రవేశపెడతారు. ఈ పద్ధతినే పిండమార్పిడి అంటారు.

చేపలను అధిక సంఖ్యలో పెంచడాన్ని మత్స్య సంవర్ధనం అంటారు. చేప మాంసంలో విటమిన్-ఎ, డి, శరీరానికి ఉపయోగపడే అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. బొచ్చె, వాలుగ, మట్టగిడస మొదలైనవి మంచి నీటి చేపలకు ఉదాహరణ. పొలస, సుడుము, సొర, రిబ్బను చేప వంటివి సముద్ర చేపలకు ఉదాహరణ. చేపలు గుడ్లు పెట్టడానికి వాటికి పియూష గ్రంథి స్రావాన్ని ఎక్కిస్తారు. చేపలను డబ్బాల్లో నిల్వ చేసే ముందు క్లాడ్లీడియం బోటులీనమ్ వంటి బాక్టీరియాలను లేకుండా చూడాలి. మేకలు,

గొర్రెల నుంచి మనకు మాంసం, ఉన్ని లభిస్తుంది. నెల్లూరు జాతి గొర్రెలు రుచిగల మాంసాన్ని, దక్కన్ జాతి గొర్రెలు మాంసంతో పాటు ఉన్నిని కూడా ఇస్తాయి. కోళ్లలో గుడ్లు పెట్టే వాటిని లేయర్స్ అని, మాంసం కోసం పెంచే వాటిని బ్రాయిలర్స్ అని అంటారు. గుడ్లను అధిక సంఖ్యలో ఉత్పత్తి చేయడానికి వైట్ లెగ్ హార్న్ రకాన్ని పెంచుతారు.

జంతువులు - ఉపయోగాలు

పట్టుదారం పట్టుపురుగుల నుంచి లభిస్తుంది. వీటి పెంపకాన్ని సెరికల్చర్ అంటారు. పట్టుపురుగు గొంగళి పురుగు దశలో ఉన్నప్పుడు పట్టును ఉత్పత్తి చేస్తుంది. దీని లాలాజలం గ్రంథులు పట్టు గ్రంథులుగా మార్పు చెంది ఉంటాయి. పట్టులో నాలుగు రకాలున్నాయి. అవి: మల్బరి పట్టు, టస్సార్ పట్టు, ఈరిపట్టు, ముగాపట్టు. వీటిలో మల్బరి పట్టు ఎక్కువ నాణ్యమైంది. మల్బరి పట్టును ఉత్పత్తిచేసే పట్టుపురుగు శాస్త్రీయనామం బొంబెక్స్ మోరి. ఇవి మల్బరి ఆకులను ఆహారంగా తీసుకుంటాయి. 

మల్బరి పట్టు ఉత్పత్తి - వివిధ దశలు :

ఆడజీవి పెట్టిన గుడ్లు పొదిగి గొంగళిపురుగులుగా మారతాయి. ఇవి మల్బరి ఆకులుతింటూ పెరుగుతాయి. దీని తర్వాత గొంగళి పురుగులు తమ పాత కవచాన్ని వదిలి కొత్త కవచాన్ని ఏర్పర్చుకుంటాయి. దీన్ని నిర్మోచనం అంటారు. గొంగళిపురుగు శరీరం చుట్టూ పట్టు దారాలతో కోశాన్ని అల్లుకుంటుంది. దీన్ని కుకూన్ అంటారు. పట్టుపురుగు జీవితదశలోని ఈ దశను ప్యూపా అంటారు. ఈ దశ తర్వాత ప్యూపా మార్పు చెందివ ప్రౌఢజీవిగా మారి కుకూనను ఛేదించుకుని బయటికి వస్తుంది. ఈ ప్రక్రియను రూపవిక్రయం అంటారు. దీనికి ముందే కుకూన్లను వేడినీటిలో ఉంచి లోపల ఉన్న మాత ను చంపి కుకూన్ల నుంచి పట్టుదారాన్ని రీలింగ్ యూనిట్లలో సేకరిస్తారు. ప్రౌఢజీవి కుకూన్ నుంచి బయటకు వస్తే పట్టుదారం ముక్కలైపోతుంది. ఇది పట్టుదారం తయారీకి ఉపయోగపడదు. పట్టు పురుగు గొంగళిపురుగుకు సూక్ష్మజీవి వల్ల పెట్రైన్ అనే వ్యాధి వస్తుంది. పట్టులో పైబ్రోయిన్ అనే ప్రొటీను ఉంటుంది.

టస్సార్ పట్టును ఉత్పత్తిచేసే పట్టుపురుగు శాస్త్రీయనామం ఆంథిరియా పాఫియా. ఇది ఓక్, ఫిగ్ మొక్కల పై పెరుగుతుంది. ఈరి పట్టును ఉత్పత్తిచేసే పట్టుపురుగు శాస్త్రీయనామం అట్టాకస్ రిసిని. ఇది ఆముదం ఆకులను ఆహారంగా తీసుకుంటుంది. ముగా పట్టును ఆంథోరియా ఆస్సమా అనే పట్టుపురుగు ఉత్పత్తి చేస్తుంది. పట్టుదారాలు తేలికగా దృఢంగా ఉంటాయి. వీటిని దుస్తులు, పారాచూట్టు, చేపల వలలు, ఇన్సులేటర్ కాయిల్స్, రేసింగ్ కార్లటైర్లు లాంటి వాటిని తయారు చేయడానికి వాడతారు. 

తేనె:

తేనెను ఎపిస్ జాతికి చెందిన కీటకాలైన తేనెటీగలు ఉత్పత్తి చేస్తాయి. వీటి పెంపకాన్ని ఎపికల్చర్ అంటారు. ఒక గుంపులోని తేనెటీగలు రాణి ఈగ, డ్రోనులు, కూలి ఈగలు అనే రకాలుగా ఉంటాయి. సమూహానికి ఒక రాణి ఈగ మాత్రమే ఉంటుంది. గుడ్లను పెట్టడం దీని ముఖ్య విధి. కూలి ఈగలు మకరందాన్ని సేకరించి తేనె పట్టులో నింపుతాయి. వీటికి మైనపు గ్రంథులు ఉండటం వల్ల ఇవి మైనాన్ని ఉత్తప్తి చేస్తాయి. వీటికి దాడిచేసే స్వభావం ఉంటుంది. డ్రోనులు మగ ఈగలు. ఇవి రాణి ఈగతో సంపర్కం జరుపుతాయి.

తేనెటీగల్లో నాలుగు రకాలున్నాయి. అవి: 1) ఎపిస్ డార్సేట. దీన్ని రాక్ తేనెటీగ అని కూడా అంటారు. ఇది ఎక్కువ తేనెను ఇచ్చినప్పటికీ వీటిని మచ్చిక చేసుకోవడానికి వీలుపడదు. 2) ఎపిస్ ఇండికా. దీన్ని ఇండియన్ తేనెటీగ అంటారు. దీన్ని తేనెను ఉత్పత్తి చేయడానికి పెంచుతారు. 3) ఎపిస్ ఫ్లోరియా. దీన్ని చిన్న తేనెటీగ అంటారు. 4) ఎపిస్ మిల్లి ఫెరా.

తేనె మానవుడికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే చక్కెరలు, ఖనిజ లవణాలు, విటమిన్లు శరీరానికి శక్తిని, ఆరోగ్యాన్ని ఇస్తాయి. తేనెను కేకులు, బిస్కెట్లు, బ్రెడ్లు లాంటి పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఆయుర్వేద, యునాని వైద్యంలో వాడతారు. ఇది దగ్గు, ఎనీమియా, జలుబు లాంటి వాటిని నివారిస్తుంది. తేనెటీగల మైనాన్ని కొవ్వొత్తుల తయారీకి, తోళ్ల పరిశ్రమలోనూ వాడతారు. 

లక్క

లక్క టకార్డియా లక్క లేదా రాసిఫర్ లక్క అనే కీటకం శరీరం నుంచి స్రవిస్తుంది. ఇది తుమ్మ, రేగు, రావి, మామిడి, సాల్ లాంటి వృక్షాలపై పెరుగుతుంది. కీటకం చెట్ల రసాలను పీల్చుకుని రక్షణ కోసం లక్కను విడుదల చేస్తుంది. ఈ లక్కను చెట్ల నుంచి తీసి శుభ్రపరిచి అనేక రకాలుగా ఉపయోగిస్తారు. దీన్ని సీలింగ్ ఏజెంట్ గా, ప్రింటింగ్ లో, పెయింట్స్, వార్నిష్ తయారీలో ఉపయోగిస్తారు. ఆభరణాలను నింపడానికి, ప్లాస్టిక్ వస్తువుల తయారీలో ఇన్సులేటర్ గా లక్క ఉపయోగపడుతుంది. 

సర్పాలు, పక్షుల ఆర్థిక ప్రాముఖ్యం

ఇవి పొలంలో ఎలుకల జనాభాను అదుపులో ఉంచి పంటను రక్షిస్తాయి. కొన్ని దేశాల్లో సర్పాల మాంసాన్ని ఆహారంగా తీసుకుంటారు. వీటి విషాన్ని యాంటి వీనమ్ తయారు చేయడానికి, ఔషధాల తయారీకి ఉపయోగిస్తారు. సర్పాల చర్మాలను హాండ్ బ్యాగులు, బెల్టులు, కొన్ని దుస్తుల తయారీలో ఉపయోగిస్తారు. 

పక్షుల నుంచి మనకు మాంసం, గుడ్లు లభిస్తాయి. కోడి, బాతు, టర్కీ పక్షి లాంటివి మనకు ఉపయోగపడతాయి. కోళ్లలో రోడ్ ఐలెండ్, లెగ్ హరన్ జాతి కోళ్లను పెంచుతున్నారు. ఆహారం, సంతానోత్పత్తి కోసం పక్షులు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వలసపోతాయి. సైబీరియా కొంగ రష్యా నుంచి భారత దేశానికి వలస వస్తుంది. పక్షులను సహజ పరిస్థితుల్లో పరిరక్షించే ప్రదేశాన్ని శాంక్చుయరీ అంటారు. పక్షులకు కృత్రిమ వాతావరణాన్ని సృష్టించి, పరిరక్షించే ప్రదేశాన్ని ఎవియరీ అంటారు.

క్షీరదాల ఉపయోగం 

క్షీరదాల్లో ఆవు, గేదె, గుర్రం, మేక, గొర్రె, పంది లాంటి జంతువులు మానవుడికి అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఆవు, గేదెల నుంచి పాలు లభిస్తున్నాయి. కొన్ని పశువులు వ్యవసాయంలో ఉపయోగపడుతున్నాయి. మేకలు, గొర్రెల నుంచి పాలు, మాంసం, తోలు లభిస్తున్నాయి. గొర్రె శరీరం మీద పొడవుగా, బిరుసుగా, నిటారుగా ఉండే రోమాలను ద్వితీయ రోమాలు లేదా ప్లీస్ అంటారు. వీటి నుంచి ఉన్ని దుస్తులను తయారు చేస్తారు. స్పెయిన్ దేశానికి చెందిన మెరీనో జాతి, న్యూజిలాండ్ దేశానికి చెందిన కోరిడెల్ జాతి గొర్రెల నుంచి మేలు రకం ఉన్ని లభిస్తుంది. తోలుకు కొరాకుల్ జాతి గొర్రె ప్రసిద్ధిచెందింది. 

పందులను ముఖ్యంగా మాంసం కోసం పెంచుతారు. ఇవి మిగతా జంతువుల కంటే త్వరగా పెరుగుతాయి. ప్రత్యుత్పత్తి శక్తి ఎక్కువ, ఖర్చు తక్కువ. పంది మాంసాన్ని ఫోర్క్ అంటారు. దేసి గోరి రకాలు భారతదేశంలో ప్రసిద్ధి. బెర్క్ షైర్, యార్క్ షైర్, లాండ్ రేస్ రకాలు విదేశాల్లో ప్రసిద్ధి చెందాయి.

గుర్రాలు రవాణాకు, వినోదానికి ఉపయోగపడతున్నాయి. మధ్య ఆసియా, రష్యా దేశాల్లో నివసించే ప్రిజివాల్ స్కి గుర్రాలను మచ్చిక చేసిన గుర్రాల పూర్వీకులుగా భావిస్తారు. మగ గాడిద, ఆడ గుర్రం సంకర ఫలితంగా ఏర్పడిన జీవిని మ్యూల్ అంటారు. ఆడ గాడిద, మగ గుర్రం సంకర ఫలితంగా ఏర్పడ్డదాన్ని హిన్ని అంటారు. మ్యూల్స్ వంధ్య జీవులు. ఇవి పర్వత ప్రాంతాల్లో బరువులు మోయడానికి ఉపయోగపడతాయి. 

నిమ్నస్థాయి జంతువుల ప్రయోజనాలు

నిమ్నస్థాయి జంతువులైన ప్రోటోజోవాలు, స్పంజికలు, మొలస్కా జీవులు అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ప్రోటోజోవా వర్గంలోని ఫారామిని ఫెరిడా, రేడియోలేరియా విభాగ జీవులు కవచంతో ఉంటాయి. ఇది కాల్షియం కార్బొనేట్, సిలికాన్తో నిర్మితమై ఉంటుంది. ఈజీవులు చనిపోయిన తర్వాత వీటి అస్థిపంజరాలు సముద్రం ఆడుగుకు చేరి ఓషన్ ఊజ్ గా ఏర్పడి, గట్టిపడి శిలలుగా ఏర్పడతాయి. ఇలాంటి రాయిలాంటి నిర్మాణాలతో కట్టడాలను నిర్మిస్తారు. ఇవి పరిశ్రమల్లో మెరుగు పెట్టడానికి, ఆకురాయిలా వాడటానికి కూడా ఉపయోగపడుతున్నాయి.

సముద్రాల్లో నివసించే స్పంజికల అస్థిపంజరం కంటకాలతో నిర్మితమై ఉంటుంది. ఈ కంటకాలు కాల్షియం కార్పొనేట్, సిలికాన్, స్పాంజిన్ తంతువులతో నిర్మితం. స్పంజికలు మరణించిన తర్వాత కంటకాలు సముద్రం అడుగుభాగానికి చేరి అడ్డుగోడల్లో తయారవుతాయి. ఈ ప్రదేశం అనేక జంతువులకు ఆవాసంగా ఉంటుంది. మొలస్కా జంతువులు మానవుడికి ఆహారం, అలంకరణ వస్తువులుగా ఉపయోగపడతాయి. వీటిలో రెండు కల్పాలుండే ద్వికవాటులైన ఆల్చిప్ప, ఆయిష్టర్లు ఆహారంగా ఉపయోగపడతాయి. మొలస్కా జంతువుల పైన ఉండే కర్పరాలను ఆటబొమ్మలు, అలంకరణ వస్తువుల తయారీకి, కోళ్లకు ఆహారం, రోడ్ల నిర్మాణానికి ఉపయోగిస్తారు. ముత్యాలు మొలస్కా జీవులైన ముత్యపు చిప్పలు లేదా పెరల్ ఆయస్టర్ల నుంచి లభ్యమవుతాయి. ఈ జీవుల కర్పరంలోకి ఇసుక రేణువుల లాంటివి చేరినప్పుడు దాని చుట్టూ కాల్షియం కార్బొనేటు స్రవించి ముత్యంలా మారుతుంది.

జీవ నియంత్రణ

పంటలను ఆశించే కీటకాలను, వాటి సహజ శత్రువులను లేదా ఇతర జీవులను ఉపయోగించి నియంత్రించడాన్ని జీవశాస్త్రీయ నియంత్రణ లేదా జీవనియంత్రణ అంటారు. సాధారణ పద్ధతిలో కీటకాలను సంహరించడానికి డి.డి.టి. లాంటి కీటక నాశనులను వాడుతున్నారు. దీనివల్ల కాలుష్యం కలగడంతోపాటు అనేక దుష్ప్రభావాలు ఉన్నాయి. జీవ నియంత్రణలో కీటకాలను ప్రోటోజోవా జీవులను పరాన్నజీవులుగా ఉపయోగించి చీడ పురుగులను సంహరిస్తారు. ఇవి చీడ పురుగులోకి ప్రవేశించి వాటికి వ్యాధులను కలుగజేసి నియంత్రిస్తాయి. ఉదాహరణకు టాకినాడ అను ఈగలను, గొంగళిపురుగులను అదుపులో పెట్టడానికి ఉపయోగిస్తారు.

చీడపీడలను అదుపులో పెట్టడానికి వాటిని ఆహారంగా తీసుకునే పరభక్షకాలను ఉపయోగిస్తారు. ఉదాహరణకు నీటిలో నివసించే దోమ కీటక లార్వాలను సంహరించడానికి చేపలను ఉపయోగిస్తారు. పక్షులు, కప్పలు కూడా పరభక్షోఆలుగా ఉపయోగపడతాయి. కీటకాలు సంపర్కానికి సిద్ధంగా ఉన్నప్పుడు విడుదలచేసే బాహ్య హార్మోన్లను ఫెరమోన్లు అంటారు. ఇవి కీటకాలను ఆకర్షించడానికి తోడ్పడతాయి. ఈ హార్మోన్లను కీటకాల బోనుల్లో ఉంచి చీడ పురుగులను అదుపులో ఉంచుతారు.

మరో జీవ నియంత్రణ పద్ధతిలో మగ పురుగులకు మాత్రమే శక్తిమంత X కిరణాలను ప్రసరింపజేసి వాటిని వంధ్య జీవులగా మారుస్తారు. ఈ పద్ధతిని స్టెరిలైజేషన్ అంటారు. వేప లాంటి మొక్కల నుంచి వచ్చిన రసాయనాలు కూడా చీడపీడలను సంహరించడానికి ఉపయోగపడతాయి. ఇవి కీటకాల రూప విక్రయాన్ని నిలుపుదల చేసి వాటి అభివృద్ధిని నిరోధిస్తాయి. ఆహార పదార్థాల నిల్వ ధాన్యాలు, వండిన ఆహార పదార్థాలు, సండ్లు, కూరగాయల లాంటి వాటిని సరిగా నిల్వచేయాలి. లేకపోతే వాటి పై కీటకాలు, బ్యాక్టీరియా, శిలీంద్రాలు ఆశించి నష్టం కలుగజేస్తాయి. ఆహారపదార్థాలపై శిలీంద్రాలు చర్య జరిపి వాటిని ఇతర పదార్థాలుగా మారుస్తాయి. ఉదా: చక్కెర ద్రావణం,

జామ్ లపై ఈస్ట్ అనే శిలీంద్రం పెరిగి ఆ పదార్థాలను ఆల్కమాల్, కార్బన్ డై ఆక్సైడ్ గా మారుస్తుంది. సరిగా నిల్వచేయని చేపలపై క్లాస్ట్రీడియం బ్యాక్టీరియా పెరిగి విషపూరితం చేస్తుంది. వేరు సెనగను సరిగా నిల్వచేయకపోతే వాటి పై శిలీంద్రాలు ఆశించి అప్లోటాక్సిన్ విషపదార్థాన్ని ఉత్పత్తిచేస్తాయి. అది కాలేయానికి హానికరం. ఆహార పదార్థాలను నిల్వచేయడానికి కింది పద్ధతులున్నాయి.

ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, చేపలు లాంటి వాటిని ఎండబెట్టి నిల్వ చేయవచ్చు. దీనివల్ల ఈ పదార్థాల్లోని తేమ బాగా తగ్గిపోయి సూక్ష్మజీవుల పెరుగుదలకు అనువుగా ఉండదు. చేపలు, మాంసం లాంటి వాటిని మండుతున్న కట్టెలపై ఉంచి కూడా వాటిలోని తేమను తొలగించి సూక్ష్మ జీవుల పెరుగుదలను అరికట్టవచ్చు. చిన్నపిల్లల ఆహారం, పాలపొడి లాంటి వాటిని పరిశ్రమల్లో తుంపర పద్దతిలో ఆరబెడతారు. మామిడి, చింత, టమాట లాంటి వాటిని ఉప్పును కలిపి ఎండబెట్టడం లేదా ఊరవేయడం ద్వారా నిల్వచేయొచ్చు. ఆహార పదార్థాలను రిఫ్రిజరేటర్ లో ఉంచడం వల్ల తక్కువ ఉష్ణోగ్రత వద్ద సూక్ష్మజీవుల పెరుగుదల ఆగిపోతుంది.

గ్రామీణ ప్రాంతాలలో ధాన్యాలను నేల గదుల్లో నిల్వ చేస్తారు. పాల లాంటి ద్రవాలను నిల్వ చేయడానికి వాటిని పాశ్చరైజేషన్ చేస్తారు. పాలను 65°C వద 30 సెకన్లు లేదా 72°C వద్ద 15 సెకన్లు ఉంచి సూక్ష్మజీవరహితం చేయడాన్ని పాశ్చరైజేషన్ అంటారు.

ఆహార పదార్థాలను ఉడికించి డబ్బాల్లో ఉంచి గాలి లేకుండా సీలువేసి నిల్వచేస్తారు. గాలి లేకపోవడం వల్ల చాలావరకు సూక్ష్మజీవుల పెరుగుదల ఆగిపోతుంది. ధాన్యాలను నాశనం చేసే కీటకాలను సంహరించడానికి డి.డి.టి., మలాథియాన్ లాంటి కీటక నాశనులను వాడతారు. పొగబారినుంచి ధాన్యాన్ని నిల్వ చేసేటప్పుడు ఇథైలిన్ డై బ్రోమైడ్ లేదా అల్యూమినియం ఫాస్పయిడ్ ను ఉపయోగిస్తారు. ఎలుకలను నియంత్రించడానికి జింక్ ఫాస్పయిడ్, వార్పరిన్ అనే రసాయనాలను ఆహారపదార్థాలతో కలిపి తినేట్లు చేస్తారు. దీనివల్ల అవి చనిపోతాయి.

జంతువుల వర్గీకరణ

జంతువులన్నింటిని వెన్నెముక లక్షణం ఆధారంగా రెండు రకాలుగా విభజించారు. అవి: 1) అకశేరుకాలు లేదా వెన్నెముకలేని జంతువులు 2) సకశేరుకాలు లేదా వెన్నెముక కలిగిన జంతువులు. 

అకశేరుకాలు : 

1. ప్రోటోజోవా

2. ఫొరిఫెరా

3. సీలెంటరేటా

4. ప్లాటి హెల్మింథిస్ని

5. మాటి హెల్మింథిస్

6. నిలేడా

7. ఆర్థ్రోపోడా 

8. మొలస్కా 

9. ఇఖైనోడర్మేటా 

ప్రోటోజోవా : ఇవి జంతువుల్లో ప్రాథమిక జీవులు. ఇవి ఏకకణయుతంగా నిర్దిష్ట కేంద్రకంతో ఉంటాయి. ప్రత్యుత్పత్తి అలైంగిక, లైంగిక పద్ధతుల ద్వారా జరుగుతుంది. అమీబా, పారామీషియం, వర్టి సెల్లా, ప్లాస్మోడియం, యూగ్లినా లాంటివి ప్రోటోజోవాజీవులకు ఉదాహరణ. 

పొరిఫెరాజీవులు : ఇవి బహుకణ జీవులు. వీటి శరీరంలో అనేక రంధ్రాలు ఉంటాయి. ఇవి స్థానబద్ద జీవులు. వీటికి ఉదాహరణ స్పంజికలు. 

సీలెంటరేటా : ఈ జీవులు రెండు పొరలతో కూడిన దేహాన్ని చూపుతాయి. కాబట్టి వీటిని ద్విస్తరిత జీవులు అంటారు. శరీరం మధ్యలో కుహరం ఉంటుంది. నోటి చుట్టూ స్పర్శకాలు లేదా టెంటకిల్స్ అనే నిర్మాణాలుంటాయి. ఇవి ఆహార సేకరణకు, గమనానికి ఉపయోగపడతాయి. హైడ్రా అనేది సీలెంటరేటాకు చెందిన జీవి.

ప్లాటి హెల్మింథిస్ : ఈ జీవులు బల్లపరుపుగా ఉండే జీవులు. వీటి శరీరంలో మూడు పొరలుంటాయి. కాబట్టి ఇవి త్రిస్తరిత జీవులు. ఈ విభాగంలో ఎక్కువగా జీవులు పరాన్న జీవనం గడుపుతాయి. ఉదాహరణకు మానవుడి జీర్ణనాళంలో నివసించే బద్దెపురుగు. 

నిమాటి హెల్మింథిస్ : ఇవి  పొడవుగా, స్తూపాకారంగా రెండు చివరల మొనదేలి ఉంటాయి. ఇవి దారపు పోగుల్లా ఉంటాయి. వీటికి ఉదాహరణ మానవుడి పేగులో నివసించే ఏలికపాము. 

అనిలెడా : ఈ జీవుల్లో శరీరం స్తూపాకారంగా ఉండి శరీరమంతా ఉంగరాల్లాంటి ఖండితాలు ఉంటాయి. ఇవి త్రిస్తరిత జీవులు. వానపాము, జలగ వీటికి ఉదాహరణ.

ఆర్థ్రోపోడా : వీటికి కీళ్లతో కూడిన కాళ్లు ఉంటాయి. ఇవి జంతురాజ్యంలో అత్యధికంగా ఉండే జీవులు. ఈగ, బొద్దింక లాంటి కీటకాలతోపాటు సాలెపురుగు, తేలు, పీతలాంటి జంతువులు. ఈ విభాగానికి చెందుతాయి. 

మొలస్కా : మెత్తటి శరీరం ఉన్న జీవులు మొలస్కా విభాగానికి చెందుతాయి. వీటికి రక్షణగా శరీరంపైన పెంకు లాంటి కర్పరముంటుంది. ఇవి సముద్రాల్లో, మంచి నీటిలో నివసిస్తాయి. నత్త, ఆల్చిప్ప, ముత్యాలను ఏర్పరిచే ముత్యపు చిప్పలు వీటికి ఉదాహరణ. 

ఇఖైనోడర్మేటా : జీవుల చర్మం మందంగా ముళ్లతో ఉంటుంది. ఇవి పూర్తిగా సముద్రపు జీవులు. సముద్ర నక్షత్రం, సముద్ర దోసకాయలు, సీఅర్చిన్ లాంటి జీవులు వీటికి ఉదాహరణ.

సకశేరుకాలు

వెన్నెముక ఉన్న జంతువులు అభివృద్ధి చెందిన జీవులు. వీటిని చేపలు, ఉభయచరజీవులు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు అనే విభాగాలుగా విభజించారు. 

చేపలు : ఇవి జలచర జీవనం గడుపుతాయి. వీటి శరీరంపై పొలుసులుంటాయి. రెండు గదుల గుండె ఉంటుంది. దేహ ఉష్ణోగ్రత పరిసరాలకు అనుగుణంగా మారుతూ ఉంటుంది. కాబట్టి వీటిని శీతలరక్త జీవులు అంటారు. ఉదాహరణకు సొరచేప, కొర్రమట్ట, క్యాట్ ఫిష్ మొదలైనవి. 

ఉభయచరజీవులు : ఇవి నీటిలోను, నేలపైనా జీవిస్తాయి. చర్మం తడిగా ఉండి, గుండె మూడు గదులతో ఉంటుంది. వీటికి చలించడానికి ఒక జంత అంగాలు ఉంటాయి. వీటికి ఉదాహరణ కప్ప. 

సరీసృపాలు : ఇవి భూమిపై పాకే జంతువులు. వీటి శరీరంపై పొలుసులు ఉంటాయి. వీటి గుండె అసంపూర్తిగా విభజన చెందిన నాలుగు గదులతో ఉంటుంది. మొసలి, బల్లి లాంటి జీవుల్లో గమనానికి రెండు జతల అంగాలు ఉంటాయి. పాము, తాబేలు, మొసలి సరీసృపాలకు చెందిన జీవులు.

పక్షులు : ఇవి ఎగరడానికి తగిన దేహ అనుకూలనాలను చూపుతాయి. శరీరంపై ఈకలుంటాయి. ముందరి జత అంగాలు రెక్కలుగా మార్పు చెంది ఎగరడానికి ఉపయోగపడతాయి. నోరు ముందుకు సాగి ముక్కుగా మార్పు చెంది ఉంటుంది. ఇవి ఉష్ణరక్తజీవులు. శరీర ఉష్ణోగ్రత పరిసరాలకు అనుగుణంగా మారకుండా స్థిరంగా ఉంటుంది. నాలుగు గదుల గుండెతో ఉంటాయి. 

క్షీరదాలు : ఇవి క్షీరగ్రంథులను కలిగి ఉంటాయి. శరీరంపై వెంట్రుకలు, దంతాలు అనేక రకాలుగా ఉండి, విభాజక పటలం (డయాఫ్రమ్) ఉండటం వీటి ముఖ్య లక్షణం. ఇవి కూడా ఉష్ణరక్త జంతువులు. మానవుడు, కోతి తిమింగలం, ఆవు లాంటివి క్షీరదాలకు ఉదాహరణ.

జంతువులలో పోషకాహార విధానం

జంతువులు తమ ఆహారాన్ని తామే తయారు చేసుకోలేవు కాబట్టి వాటిని పరపోషకాలు అంటారు. జంతువులకు తయారయిన ఆహారం అవసరం కాబట్టి అవి తినే మొక్కలు లేదా ఇతర జంతువులపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు, పాము కప్పలను తింటాయి, కీటకాలు జంతువుల మృతదేహాలను తింటాయి, పక్షులు పురుగులు మరియు కీటకాలను తింటాయి.

పోషకాహార పద్ధతులు

పోషకాహారంలో రెండు రకాలు ఉన్నాయి. అవి: 

1) స్వయం పోషణ (ఆటోట్రోఫిక్) 

2) పరపోషణ (హెటెరోట్రోఫిక్) పరపోషణ ద్వారా పోషకాహారం

అన్ని జంతువులు కార్బన్ డయాక్సైడ్ మరియు నీరు వంటి సాధారణ అకర్బన పదార్థాల నుండి తమ స్వంత ఆహారాన్ని తయారు చేసుకోలేవు. ఇవి ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడతాయి. దీనిని పరపోషణ ద్వారా పోషకాహార తయారీ (హెటెరోట్రోఫిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్) అంటారు. ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడే జీవులను పరపోషకాలు అంటారు. ఉదాహరణకు, మనిషి, కుక్క, పిల్లి, జింక, పులి, ఆవు, ఈస్ట్ వంటి పచ్చని మొక్కలు అన్నీపరపోషకాలే. పోషకాహారం రకాలు

పరపోషణ విధానం

పోషకాహారం యొక్క మూడు రకాల పరపోషణ విధానాలు కలవు:

1) పూతికాహారుల పోషణ 

2) పరాన్నజీవి పోషణ

3) జాంతవ భక్షక (హోలోజోయిక్)పోషణ

పూతికాహారులు పోషణ

పూతికాహారులు అంటే తమ ఆహారాన్ని పొందడం కోసం చనిపోయిన మరియు కుళ్ళిపోతున్న సేంద్రియ పదార్థాలపై ఆధారపడే జీవులు. ఈ జీవులు చనిపోయిన మరియు కుళ్ళిన చెట్ల కుళ్ళిన కలప, కుళ్ళిన ఆకులు, చనిపోయిన జంతువులు, కుళ్ళిన రొట్టె మొదలైన వాటిని తింటాయి.

శిలీంధ్రాలు మరియు అనేక బ్యాక్టీరియా పూతికాహారుల వర్గంలోకి వస్తాయి. పూతికాహారులు చనిపోయిన మరియు క్షీణిస్తున్న సేంద్రియ పదార్థాల నుండి సంక్లిష్ట సేంద్రియ పదార్థాన్ని వాటి వెలుపల సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేసి ఈ సరళమైన పదార్థాలను గ్రహిస్తాయి.

పరాన్నజీవి పోషణ

ఈ విధానంలో జీవులు ఇతర జీవులను చంపకుండా వాటి అతిథేయి అని పిలువబడే ఇతర జీవులను తింటాయి. ఒక క్రమ పద్ధతిలో ఆహారాన్ని పొందే జీవులను పరాన్నజీవులు అంటారు. పరాన్నజీవులు అతిథేయికి హాని చేస్తాయి, అది మొక్క లేదా జంతువు కావచ్చు. పరాన్నజీవులు మానవజాతికి, పెంపుడు జంతువులకు మరియు పంటలకు వ్యాధులను కలిగిస్తాయి. శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, కుకుటా వంటి కొన్ని మొక్కలు, ప్లాస్మోడియం, రౌండ్వార్మ్లు వంటి కొన్ని జంతువులు పరాన్నజీవి పోషణకు ఉదాహరణలు.

జాంతవ భక్షక పోషణ

ఈ విధానంలో జీవులు ఘన లేదా ద్రవ ఆహారాన్ని స్వీకరిస్తాయి. ఆ ఆహారం మొక్కల ఉత్పత్తి లేదా జంతు ఉత్పత్తి ఏదైనా కావచ్చు. ఈ ప్రక్రియలో ఒక జీవి సంక్లిష్టమైన సేంద్రీయ ఆహార పదార్థాన్ని తన శరీరంలోకి తీసుకుంటుంది. తరువాత శరీర కణాలలోకి శోషించబడిన ఆహారాన్ని జీర్ణం చేసుకుంటుంది. శోషించబడని ఆహారం విసర్జన ప్రక్రియ ద్వారా జీవుల శరీరం నుండి బయటికి పంపబడుతుంది. మనిషి, పిల్లి, కుక్క, ఎలుగుబంటి, జిరాఫీ మొదలైనవి ఈ రకమైన పోషణను కలిగి ఉండే జీవులకు ఉదాహరణలు.

ఆహారపు అలవాట్ల ఆధారంగా జంతువులను మూడుసమూహాగా విభజించవచ్చు:

1) శాకాహారులు

2) మాంసాహారులు

3) సర్వభక్షకులు 

శాకాహారులు

గడ్డి, ఆకులు, పండ్లు, బెరడు మొదలైన మొక్కలను మాత్రమే తినే జంతువులను శాకాహారులు అంటారు. శాకాహార జంతువులకు ఉదాహరణలు ఆవు, మేక, గొర్రెలు, గుర్రం, ఒంటె, జింక మొదలైనవి.

మాంసాహారులు

ఇతర జీవులను మాత్రమే తినే జంతువులను మాంసాహారులు అంటారు. ఇవి మొక్కలను తినవు. సింహం, పులి, కప్ప, రాబందు, తోడేలు, బల్లి మొదలైనవి మాంసాహార జంతువులకు ఉదాహరణలు.

సర్వభక్షకులు

మొక్కలు మరియు ఇతర జంతువుల మాంసం రెండింటినీ తినే జంతువులను సర్వభక్షకులు అంటారు. కుక్క, కాకి, పిచ్చుక, ఎలుగుబంటి, చీమ మొదలైనవి సర్వభక్షక జంతువులకు ఉదాహరణలు.

జంతువులలో పోషకాహార ప్రక్రియ

జంతువులలో పోషకాహార ప్రక్రియలో వివిధ దశలు జంతువులలో పోషణ ప్రక్రియలో ఐదు దశలు ఉన్నాయి:

1) అంతరగ్రహణం

2) జీర్ణక్రియ

3) శోషణ

4) స్వాంగీకరణ

5) విసర్జన

అంతరగ్రహణం

శక్తిని పొందడానికి మరియు జీవిత కార్యకలాపాలను కొనసాగించడానికి ఆహారం తినడాన్ని అంతరగ్రహణం అంటారు. 

జీర్ణక్రియ

జంతువులు తినే ఆహారం వాటి శరీరం గ్రహించలేని పెద్ద కరగని అణువును కలిగి ఉంటుంది. కాబట్టి ఈ కరగని ఆహార అణువులను చిన్న అణువులుగా విభజించే ప్రక్రియను జీర్ణక్రియ అంటారు.

జంతువులు జీర్ణక్రియకు భౌతిక మరియు రసాయన పద్ధతులను ఉపయోగిస్తాయి. భౌతిక పద్ధతి అంటే నోటిలో ఆహారాన్ని నమలడం, నెమరువేయడం(కొన్ని జంతువులు); రసాయన పద్ధతి అంటే శరీరం ఆహారంలో జీర్ణ రసాలను కలపడం. జీర్ణం అయిన తర్వాత ఆహారాన్ని శరీరం ఉపయోగించుకుంటుంది.

శోషణం

ఆహార అణువులు చిన్నవిగా మారిన తర్వాత అవి పేగు గోడల గుండా వెళ్లి రక్తంలోకి ప్రవేశిస్తాయి. ఈ ప్రక్రియను శోషణ అంటారు.

స్వాంగీకరణ

తిన్న ఆహారం శరీరంలోని అన్ని భాగాలకు, ప్రతి కణానికి చేరవేయబడి తద్వారా శక్తి ఉత్పత్తి జరుగుతుంది. శరీరం యొక్క పెరుగుదల, మరమ్మత్తు కోసం పదార్థాలు తయారు చేయబడతాయి. ఈ ప్రక్రియను స్వాంగీకరణం అంటారు. క్లుప్తంగా చెప్పాలంటే శరీరంచే శోషించబడిన ఆహారం శరీరంలోకి కలిసి పోవడాన్ని స్వాంగీకరణం అంటారు.

విసర్జన

జీర్ణం కాని ఆహారాన్ని శరీరం నుండి బయటకు తరలించే ప్రక్రియను విసర్జన అంటారు.

ఏకకణ జీవులలో పోషణ ప్రక్రియ ఒకే కణం ద్వారా మాత్రమే జరుగుతుంది.

రక్తకణాలు

ఇవి మూడు రకాలు. అవి ఎర్రరక్తకణాలు, తెల్ల రక్తకణాలు, రక్తఫలికికలు. రక్త కణాలు ఎముక మజ్జ నుంచి ఏర్పడుతాయి. పిండాభివృద్ధిలో వీటిని కాలేయం ఏర్పరుస్తుంది. రక్తం, రక్తకణాలు ఏర్పడడాన్ని హీమోపాయిసస్ అంటారు. శరీరంలోని మరో ముఖ్య ద్రవం శోషరసం. ఎర్రరక్త కణాలు లేని ద్రవం శోషరసం. శరీర కణజాలాల మధ్య ప్రత్యేక నాళాల్లో శోషరసం ప్రవహిస్తుంది. దీనిలో తెల్ల రక్తకణాలు ఉంటాయి కాబట్టి ఇదికూడా రోగనిరోధక శక్తిలో పాల్గొంటుంది. 

ఎర్ర రక్తకణాలు: 

ప్రతి క్యూబిక్ మిల్లీ మీటరు రక్తంలో 4.5 నుంచి 5 మిలియన్ల ఎర్రరక్తకణాలు ఉంటాయి. శరీరంలో సుమారు 32 బిలియన్ల ఎర్ర రక్తకణాలు ఉంటాయి. ఎర్ర రక్తకణాల జీవితకాలం 120 రోజులు ఆ తర్వాత అవి ప్లీహంలో నశిస్తాయి. ఎముక మజ్జలో ఇవి ఏర్పడడాన్ని ఎరిత్రోపాయిసిస్ అంటారు. ఇవి ద్విపుటాకారంలో ఉంటాయి. అభివృద్ధి చెందిన క్షీరదాల ఎర్ర రక్తకణాల్లో కేంద్రకం, ఇతర కణభాగాలు ఉండవు. కేవలం హీమోగ్లోబిన్ మాత్రమే ఉంటుంది. హీమోగ్లోబిన్లో రెండు భాగాలు ఉంటాయి. అవి.. హీం, గ్లోబిన్. ఇనుమును ఫెర్రస్ రూపంలో కలిగి ఉన్న కర్బన పదార్థం హీం. గ్లోబిన్ ఒక ప్రొటీన్. రక్తం ఎరుపురంగులో ఉండటానికి కారణమైన వర్ణకం హీమోగ్లోబిన్. ఇది ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్ల రవాణాను నిర్వహిస్తుంది. ప్రతి హీమోగ్లోబిన్ అణువు నాలుగు ఆక్సిజన్ అణువులను రవాణా చేస్తుంది. హీమోగ్లోబిన్ ఏర్పడడానికి, ఎర్రరక్తకణాలు అభివృద్ధి చెందడానికి ఇనుము, విటమిన్ బి12 (సైనకోబాలమిన్), విటమిన్ బి2 (ఫోలిక్ ఆమ్లం) అవసరమవుతాయి. ఆహారంలో ఇవి లోపిస్తే అనీమియా (రక్తహీనత) సంభవిస్తుంది. 

తెల్ల రక్తకణాలు: 

వీటిని ల్యూకోసైట్లు అంటారు. శరీర రక్షక భటులుగా వ్యవహరిస్యాఇ. వీటి జీవితకాలం కొన్ని రోజుల నుంచి కొన్ని వారాల వరకు ఉంటుంది. ఇవి ప్రధానంగా రెండు రకాలు.  గ్రాన్యులోసైట్లు, ఎగ్రాన్యులోసైట్లు. గ్రాన్యులోసైట్ల కణద్రవ్యంలో ప్రత్యేక కణికలు ఉంటాయి. ఇవి ప్రధానంగా మూడు రకాలు. అసిడోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్, ఎగ్రాన్యులోసైట్లు రెండు రకాలు. మోనోసైట్లు, అసిడోఫిల్స్ లేదా ఇసినోఫిల్స్, అలర్జీ చర్యల్లో పాల్గొంటాయి. న్యూట్రోఫిల్స్, మోనోసైట్లు భక్షక కణాలుగా వ్యవహరిస్తాయి. శరీర రోగ నిరోధక శక్తిలో ప్రధానమైనవి లింఫోసైట్లు. ఇవి రెండు రకాలు. అవి T, B లింఫోసైట్లు. T లింఫోసైట్లు మళ్లీ రెండు రకాలు. అవి CD4/ T4 కణాలు, CD8 కణాలు. శరీరంలోకి ప్రవేశించిన వ్యాధి కారకాన్ని గుర్తించి దాన్ని నాశనం చేసే ప్రక్రియను T లింఫోసైట్లు ప్రారంభిస్తాయి. వీటి ద్వారా సెల్యులార్ ఇమ్యూనిటీ లభిస్తుంది. వ్యాధి కారకానికి విరుద్ధంగా ప్రతి దేహకాల (యాంటి బాడీస్) ను విడుదల చేసి ఇమ్యూనిటీని అందించేవి B లింఫోసైట్లు. ఈ రకమైన ఇమ్యూనిటీ హ్యుమోరల్ ఇమ్యూనిటీ తెల్ల రక్తకణాల సంఖ్య అసాధారణంగా పెరిగితే ల్యుకేమియా లేదా రక్త కేన్సర్ వస్తుంది. వీటి సంఖ్య అసాధారణంగా తగ్గడం ల్యూకోపినియా. 

రక్త ఫలకికలు: 

ఇవి నిజమైన కణాలు కాదు. ఎముక మజ్జలో మెగాక్యారియో సెట్ల నుంచి ఏర్పడిన ఖండితాలు. వీటి జీవితకాలం 3-10 రోజులు. ప్రతి క్యూబక్ మిల్లీ మీటరు రక్తంలో 2.56 లక్షలు ఉంటాయి. గాయమైనప్పుడు రక్త స్కందన ప్రక్రియను ప్రారంభిస్తాయి. గాయమైన ప్రాంతంలో ఇవి విచ్ఛిన్నం చెంది థ్రాంబోప్లాస్టిన్ పదార్థాన్ని విడుదలచేస్తాయి. ఇవి రక్తంలోని ప్రాథాంబినను థ్రాంబిన్ గా మారుస్తాయి. ఆ తర్వాత థ్రాంబిన్ చర్య ద్వారా రక్తంలోని ఫైబ్రినోజన్ ను ఫైబ్రిన్ గా మారుస్తాయి. ఫైబ్రిన్ ప్రొటీన్ పోగులుగా మారి సంక్లిష్ట జాలకాన్ని ఏర్పర్చి రక్తం నష్టాన్ని నివారిస్తుంది. ఈ ప్రక్రియలో 13 ప్రధాన రక్తస్కందన కారకాలు, కొన్ని అనుబంధ కారకాలు పాల్గొంటాయి. శరీరంలో రక్తం గడ్డకట్టడాన్ని హిపారిన్ నివారిస్తుంది. రక్త సంకోచానికి కావాల్సిన ఖనిజం కాల్షియం. అనుబంధ కారకాల్లో ముఖ్యమైంది. విటమిన్-కె. ఏ చిన్న దెబ్బ తగిలినా రక్తస్కంధనం జరగని వ్యాధి హీమోఫీలియో. కృత్రిమ రక్తస్కందన కారకాలుగా ఉపయోగించేవి సిట్రేట్లు, ఆక్సలేట్లు, డైకెమరల్.